అనుకున్నదే అయింది… అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిస్సాలో పర్యటించిన కేంద్ర హొంమంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.అధికారంలోకి రాగానే ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని అమిత్ షా ప్రకటించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగం దీనిని అనుమతించదని అమిత్ షా అన్నారు.
ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ను తొలగించి వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు పంపిణీ చేస్తామని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. “ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు బీజేపీ మాత్రమే న్యాయం చేస్తుందని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పారు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో ముస్లింల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీని ప్రభావం ఏపీలో ఉన్న కూటమిపై కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏపీలో టీడీపీ , జనసేన పార్టీలు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ప్రకటించడంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ ఇరాకటంలో పడినట్లు అయింది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ ఏం చేయాలో తెలియని ధర్మసంకటంలో నిలిచింది.
పొత్తులో భాగంగా ఏపీలో కూడా 4 శాతం రిజర్వేషన్ తీసేస్తారనే అభద్రతాభావంతో ముస్లింలు ఉన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయ ప్రభావం కచ్చింతంగా వచ్చే ఎన్నికల్లో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం ప్రజలు ఉండే నియోజకవర్గాల్లో ఫలితాలు మార్చే విధంగా దీని ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
దీనిపై అధికార వైసీపీ మాటల యుద్ధం మొదలుపెట్టింది. ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తీసేస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారని..దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఏపీలో కూడా ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్ తీసేస్తారా..? లేదా బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారా అంటూ టీడీపీని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
