మాధవీలత.. ఇటీవల వార్తలో నిలుస్తున్న వ్యక్తి ఈమె. ఆధ్యాత్మిక భావనతో నిండైన చీరకట్టు, తెలుగుదనం ఉట్టిపడే బొట్టుతో ఆకట్టుకునేలా ఉంటారు. సోషల్మీడియా ద్వారా చాలా మందికి పరిచయం అయ్యారు. ఇక తాజాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హైదరాబాద్ అభ్యర్థిగా ప్రకటించడంలో మీడియాతోపాటు అన్ని పార్టీల దృష్టి ఆమెపై పడింది. ఎవరీ మాధవీలత, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి.. హైదరాబాద్షా అసద్భాయ్ని ఢీకొడుతుందా అన్న చర్చ జరుగుతూనే ఉంది. గెలుపోటమి సంగతులు దేవుడెరుగు. మాటలతోనే హైదరాబాద్ను గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ కాన్ఫిడెన్సే ఆమెకు బీజేపీ టికెట్ వచ్చేలా చేసింది. ఇప్పుడు మాధవీలత మాటలు చూసి ప్రధాని మోదీసైతం ఫిదా అయ్యారు.
విస్తృతంగా ప్రచారం..
బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలత విరించి ఆస్పత్రి చైర్పర్సన్ గా అందరికీ చిరపరిచితమే.. ఇప్పటికే బలమైన ప్రచారం మొదలు పెట్టారు. సోషల్ మీడియా ద్వారా క్యాంపెయినింగ్ బలంగా సాగుతోంది. తాజాగా ఆమె ఆప్ కీ అదాలత్ అనే షోలో పాల్గొన్నారు. ఇందులో మాధవీలత వ్యక్తపరిచిన ఆలోచనలకు మోదీ సైతం ప్రశంసించకుండా ఉండలేకపోయారు.
ఎక్స్లో మోదీ ట్వీట్..
మాధవీలతను ప్రశంసిస్తూ ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘మాధవీలతా జీ.. మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అసాధారణమైనది. మీకు నా శుభాకాంక్షలు ఈ రోజు(ఏప్రిల్ 7న) ఉదయం ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రాం రిపీట్ టెలికాస్ట్ను చూడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.
నరనరానా హిందూ భావజాలం..
కొంపెల్ల మాధవీలత హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్స్లో ఒకటైన ‘విరించి’కి చైర్పర్సన్. అంతే కాదు బలమైన హిందూ భావజాలం పుణికుపుచ్చుకున్నారు. నగరంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో పరోపకారాలు చేస్తున్నారు. మాధవీలత సేవలను, మాట తీరును, హిందూ భావజాలాన్ని గుర్తించి బీజేపీ హైదరాబాద్ ఎంపీ టికెట్ ప్రకటించింది.
పాతబస్తీలో పెట్టి పెరిగి..
ఇక మాధవీలత హైదరాబాద్ పాతబస్తీలోనే పుట్టి పెరిగింది. నిజాం కాలేజీలో బ్యాచ్లర్ డిగ్రీ, కోటి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో మాధవీలత ఎన్సీసీ క్యాడెట్. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొందింది. సుమారు వందకు పైగా నృత్య ప్రదర్శనలు సైతం ఇచ్చారు.
