ఈనెల 27న సాయంత్రం గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేడారం మహాజాతరలో ఆయన వెల్లడించారు. ఈ రెండు పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని* తెలిపారు.
మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. *గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించిందని* రేవంత్ దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీని కళ్లకు కట్టినట్లు చూపామన్న ఆయన, *కేసీఆర్ కళ్లు మూసుకుని ఫాంహౌస్లో ఉండడం వల్లే ఏపీ సీఎం కృష్ణా జలాలను తరలించుకుపోయారని* విమర్శించారు. *రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలో శుభవార్త చెబుతామని* తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత తమదన్నారు. *ఉద్యోగులకు తాము అధికారంలోకి వచ్చిన మొదటి నెల 4వ తేదీనే జీతాలు ఇచ్చామన్న ఆయన, ఈనెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్లు* తెలిపారు. *త్వరలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ను నియమిస్తున్నట్లు,* అలానే *త్వరలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని* సీఎం హామీ ఇచ్చారు. సమైక్య పాలనలో జరగనంత దోపిడీ పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిందని నిట్టూర్చారు. *దశాబ్ద కాలం పాటు కేసీఆర్ దోపిడీ చేస్తున్నా మోదీ ఆయన్ని నిలువరించలేదన్నారు.* ఇప్పుడు మాత్రం రాష్ట్ర బీజేపీ నేతలు అవినీతిపై సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నారని ఆక్షేపించారు. సీబీఐ, ఈడీ & ఐటీ, బీజేపీ చేతిలో ఉన్నా కేసీఆర్పై ఒక్క కేసు పెట్టలేదెందుకని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టలేదన్న ఆయన, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేపదే కేంద్రానికి ఫిర్యాదు చేసినా పట్టించుకులేదని ఆరోపించారు. తాము న్యాయ విచారణ నిర్ణయం తీసుకున్న తర్వాత కమలదళం సీబీఐ విచారణ కోరుతోందని అన్నారు. *కేసీఆర్ దోపిడీలో వాటా కోసమే బీజేపీ సీబీఐ విచారణ కోరుతోందని* విమర్శించారు. *కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై త్వరలో విశ్రాంత హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ* జరుగుతుందన్నారు.
