వారం రోజుల్లోనే రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించారు. రూ.4 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం..
వారం రోజుల్లో తెలంగాణ ఆడబిడ్డల కష్టాలు తీర్చేందుకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని సీఎం ప్రకటించారు. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఇక రైతు భరోసా నిధులు కూడా మార్చి 16లోగా అందరికీ అందిస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.2 రైతు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు.
ప్రాజెక్టును పడావు పెట్టిన కేసీఆర్..
ఇక కేసీఆర్ పదేళ్ల పాలనలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై వివక్ష చూపారని సీఎం రేవంత్ ఆరోపించారు. నారాయణపేట్–కొడంగల్ ఎంత్తిపోతల పథకాన్ని 2014లో తాను మంజూరు చేయించుకొచ్చానని తెలిపారు. అయితే కేసీఆర్ దానిని పదేళ్లు పడావు పెట్టారని విమర్శించారు. ఎన్నికల ముందు మాట ఇచ్చినట్లుగా 70 ఏళ్ల గోస తీర్చేందుకు నారాయణపేట్–కొడంగల్ పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014లో మోదీ హామీ ఇచ్చారని, పదేళ్లలో ఎందుకు ఇవ్వలేదో తెలంగాణ బీజేపీ నేతులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
