తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తరువాత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. తుంటికి ఆపరేషన్ తో విశ్రాంతిలో ఉన్నారు. ఇక, ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగేందుకు ముహూర్తం ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. తొలుత పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ లక్ష్యంగా కొత్త స్కెచ్ సిద్దం చేస్తున్నారు.
ఎంపీలతో కేసీఆర్ సమావేశం : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత పార్టీ నేతలతో..ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్దమైంది. ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరగనుంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు హాజరు కానున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే చివరి విడత సమావేశాలు కావటంతో పార్టీ పరంగా ఏ అంశాలను ప్రస్తావించాలి.. వ్యూహాల పైన కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
17నుంచి నిత్యం పార్టీ కార్యాలయంలో కేసీఆర్ అందుబాటులో ఉండాలని ఇప్పటికే నిర్ణయించారు. ఫిబ్రవరి 14న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై అప్పటికి రెండు నెలల పైగా సమయం అవ్వటంతో ఇక నేరుగా ప్రభుత్వ పాలన పైన కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు, వైఫల్యాల పైన సీఎం రేవంత్ తరచూ ఆరోపణలు చేస్తున్నారు. సభలోనే వీటిని తిప్పి కొట్టేందుకు కేసీఆర్ ముందుకొస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే విధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికలను కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముందుగానే అభ్యర్దులను ఖరారు చేసి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు.
టార్గెట్ రేవంత్ : కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ గురించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రలోనే కేసీఆర్ ఎమ్మేల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. అందుకోసం మంచి ముహూర్తం చూసి తేదీ నిర్ణయిస్తారని వెల్లడించారు. త్వరలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకార తేదీ ఉంటుందని ప్రకటించారు. అలాగే ఫిబ్రవరి 17న తన బర్త్ డే రోజున కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తారని కేటీఆర్ వెల్లడించారు. ఇటు సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్న ఈ సమయంలో కేసీఆర్ అటు అసెంబ్లీకి రానుండటం..ఇటు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుండటంతో తెలంగాణ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
