మంత్రి రోజాకు ఈసారి టికెట్ దక్కుతుందా? దక్కినా ఆమె ఎమ్మెల్యేగా గెలవగలరా? అంటే ముమ్మాటికీ లేదనే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో నగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో సైతం ఆమె విజయం సాధించారు. అయితే రెండుసార్లు నగిరి నియోజకవర్గం నుంచి గెలిచేసరికి ఆమెకు ఎక్కడ లేని ధీమా వచ్చింది. అందుకే అందరితో గొడవ పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నేతలతో ఆమెకు పడడం లేదు. దీంతో ఆమెకు టిక్కెట్ ఇస్తే సహకరించమని వారు తేల్చి చెబుతున్నారు. దీంతో ఆమె స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేందుకు జగన్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
More
From Ap politics
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగిరి నియోజకవర్గం ఒకటి. ఈ జిల్లాతో పాటు రాయలసీమ మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో ఉంటుంది. ఆయన మద్దతు ఉంటే కానీ వైసీపీ టికెట్ దక్కదు. దక్కినా గెలవలేరు కూడా. ఇప్పుడు మంత్రి రోజా విషయంలో సైతం పెద్దిరెడ్డి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. మంత్రి రోజాకు వ్యతిరేకంగా నేతలను ప్రోత్సహించడంలో పెద్దిరెడ్డి ఉన్నారు. ఆయన సహకారంతోనే చాలామంది రాష్ట్రస్థాయి పదవులను దక్కించుకున్నారు. వారు మంత్రి రోజాను లెక్కచేయడం లేదు. ఐదు మండలాల్లో ఎంపీపీలు, జడ్పిటిసిలు సైతం మంత్రి రోజా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఆమెకు టిక్కెట్ ఇస్తే ఓటమి తప్పదని.. సొంత పార్టీ శ్రేణులే ఓడిస్తారని నాయకత్వానికి నివేదికలు అందాయి.
నియోజకవర్గంలో తమిళ ఓటర్లు అధికం. రోజా భర్త సెల్వమణి తమిళ వ్యక్తి కావడంతో ఆ వర్గం ఓట్లన్నీ రోజాకు పడుతూ వస్తున్నాయి. కానీ ఇటీవల రోజా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తమిళ ఓటర్లు దూరమయ్యారు. అటు పవన్ తో పాటు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో రోజా ముందుంటారు. దీంతో ఆ రెండు పార్టీల శ్రేణులు సైతం రోజాపై కోపంతో ఉన్నాయి. ఇలా ముప్పేట దాడితో రోజా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఆమెకుటికెట్ దక్కడం అనుమానమేనని తేలుతోంది. ఒకవేళ టికెట్ దక్కినా ఆమె ఓటమి తప్పదని విశ్లేషణలు వస్తున్నాయి. మరి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
