ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి పేరు చెప్తే గుర్తుకొచ్చే పార్టీ కాంగ్రెస్. సోదరుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన చరిత్ర కలిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన కుటుంబ సభ్యులెవరూ ఆ పార్టీలో కానీ, మరే పార్టీలో కూడా చేరలేదు. కానీ వివేకా హత్య దర్యాప్తు సందర్భంగా బయటపడ్డ విషయాల నేపథ్యంలో వైఎస్ కుటుంబమే తన తండ్రికి అన్యాయం చేసిందని భావిస్తున్న వైఎస్ షర్మిల ఆ మేరకు కీలక అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు.
నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు చర్చలు జరిపిన సునీతారెడ్డి ఇప్పుడు మారిన పరిస్దితుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన తండ్రి వివేకా హత్య దర్యాప్తు విషయంలో తనకు అండగా నిలిచిన సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, పీసీసీ ఛీఫ్ గా నియామకం కావడంతో సంతోషంగా ఉన్న సునీతారెడ్డి.. తాను కూడా అదే పార్టీలో చేరిక దిశగా అడుగులేస్తున్నట్లు సమాచారం.
ఈ నెల 21న పీసీసీ ఛీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టబోతున్నారు. అంతకు ముందు ఇడుపులపాయ వెళ్లి తన తండ్రి వైఎస్సార్ ఆశీస్సులు తీసుకుంటారు. అదే సమయంలో సునీతారెడ్డి కూడా ఆమెతో జత కలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తండ్రి వివేకా కేసు దర్యాప్తుకు సహకరిస్తూ బిజీగా ఉంటున్న సునీత.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి తన పోరు కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంలో త్వరలో ప్రకటన చేయవచ్చని సమాచారం.
సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ఇస్తే ఆమెకు పులివెందుల అసెంబ్లీ సీటు లేదా కడప ఎంపీ సీటు కేటాయించేందుకు ఆ పార్టీ సిద్ధంగానే ఉంటుంది. అలాగే విపక్ష టీడీపీ-జనసేన కూడా ఆమెకు మద్దతిచ్చే అవకాశం కూడా ఉంది. అటు కడప ఎంపీ సీటులో షర్మిల పోటీ చేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే షర్మిల – సునీత జోడీ వైఎస్సార్ జిల్లాలో ఎన్నిలపై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
