హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ రద్దు: భగ్గుమన్న కేటీఆర్!!

దేశంలో తొలిసారిగా గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ జరిగిన విషయం తెలిసిందే. హుస్సేన్ సాగర్ తీరం వెంబడి రేసింగ్ కార్లు ఈ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ లో పరుగులు పెట్టాయి. ఇంటర్నేషనల్ ఫార్ములా రేసింగ్ ఛాంపియన్షిప్ ని చూడడానికి హైదరాబాద్ నగరానికి పలువురు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు క్యూ కట్టారు.

 

అయితే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో ఫార్ములా ఈ రేస్ ను రద్దు చేస్తున్నట్టు ఎఫ్ ఐ ఏ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని నెరవేర్చకూడదనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉటంకిస్తూ వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 

ఫిబ్రవరి నెలలో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించబోమని నిర్వాహకులు ప్రకటించారు. ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు పేర్కొన్న నిర్వాహకులు తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

ఇదిలా ఉంటే హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ రద్దు చేయడం పైన కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయం అని, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను ఇది దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఇటువంటి ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెంచుతాయని, ఇలాంటి ఈవెంట్లు జరగకుండా అడ్డుకోవడం దారుణం అన్నారు.

 

ఇప్పటివరకు ఈ రేసింగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడంపై కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది ఈ రేసింగ్ చూడడానికి ఆసక్తి చూపారని, ఈ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేసింగ్ పై తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమయంలో దీనిని రద్దు చేయడం సరైనది కాదని ఆయన అన్నారు. భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ ప్రిక్స్ ను తీసుకురావడానికి తాము చాలా కృషి చేశామని, సమయాన్ని వెచ్చించామని కేటీఆర్ పేర్కొన్నారు.

Editor