Latest Posts

ఏపీ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం..

తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ‘యువగళం-నవశకం’ సభ పేరు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

 

నారా లోకేష్ చేసిన పాదయాత్రకు జగన్ సర్కారు అనేక అడ్డంకులు సృష్టించిందని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. యువగళం వాలంటీర్లను జైలుకు పంపారన్నారు. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. యువగళం.. ప్రజా గర్జనకు నాంది పలికిందన్నారు. ప్రజల్లో ఉండే బాధ, ఆక్రోశం, ఆగ్రహం యువగళంలో చూపించారన్నారు.

 

 

అధికార వైసీపీ నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర నలిగిపోతోందన్నారు చంద్రబాబు. మెడపై కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర పాలనలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదన్నారు. ఒకప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉండేదని.. ఇప్పుడు గంజాయి రాజదానిగా మారిందని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిందన్నారు. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. విధ్వంస పాలనకు జగన్ నాంది పలికారని విమర్శించారు.

 

వైసీపీ పాలనలో కంపెనీలన్నీ పారిపోయాయని ఎద్దేవా చేశారు చంద్రబాబు. రుషికొండను బోడి గుండు చేసి.. సీఎం నివాసం కోసం రూ. 500 కోట్లతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండివుంటే 2020 నాటికి పోలవరం పూర్తి చేసేవాళ్లమన్నారు చంద్రబాబు. అబద్ధాల పునాదులపై నిర్మించిన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మారాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 

త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి.. టీడీపీ-జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు వెల్లడించారు. నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటామన్నారు. అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.

 

అగ్రవర్ణాల పేదలను ఆర్థికంగా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీల రక్షణ కోసం చట్టం తీసుకోస్తామన్నారు. భవిష్యత్‌లో ఏయే కార్యక్రమాలు చేయాలనేదానిపై అధ్యయనం చేస్తామన్నారు. టీడీపీ-జనసేన పొత్తు ప్రకటించినప్పుడే వైసీపీ పని అయిపోయిందన్నారు. టీడీపీ-జనసేన పొత్తు చారిత్రక అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళలకు రక్షణ ఉండాలంటే.. వైసీపీ విముక్త రాష్ట్రంగా మారాలన్నారు. ఏపీలో జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Posted Under AP
Editor