తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పులు చెబుతున్నారని.. అయితే, ఆ అప్పులు ఎందుకు చేశామో చెప్పడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్ రావు.. సీఎం రేవంత్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగింది.
కాగా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్బీఐ, కాగ్ నుంచి సమాచారం తీసుకున్నామని.. శ్వేతపత్రంలో అవసరమైన చోట వాటి నవేదికలను ప్రస్తావించినట్లు చెప్పారు. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం రేవంత్ సమాధానమిచ్చారు.
2014-15లో 300 రోజులు మనకు మిగులు నిధులు ఉన్నాయన్న సీఎం రేవంత్.. గత పదేళ్లలో కనీసం 150 రోజులు కూడా మిగులు నిధులు లేవన్నారు. వాస్తవాలు దాచిపెట్టి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు. జీతాల ఆలస్యం వల్ల ఉద్యోగులు సకాలంలో వారి లోన్లు, బిల్లులు కట్టకపోవడంతో వారి సిబిల్ స్కోర్ దెబ్బతిందని చెప్పారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. లక్షల కోట్లు దుర్వినియోగం చేశారని రేవంత్ అన్నారు. అబద్ధాలతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు. ఎన్నికల ముందే వైన్స్ టెండర్లు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదంతా దోచుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ బీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు. లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు.. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి కట్టిస్తామన్నారు.. ఇలా ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ సర్కారు నెరవేర్చలేదన్నారు.
ఈ శ్వేతపత్రం.. ఎవరినో కించపరిచేందుకో.. తక్కువ చేసి చూపించేందుకో ఈ శ్వేతపత్రం తీసుకురాలేదని.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొచ్చింది కాదన్నారు సీఎం రేవంత్. కేవలం వాస్తవ పరిస్థితులను మాత్రమే ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశామన్నారు. శ్వేతపత్రాన్ని ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు సీఎం రేవంత్. అప్పులపై నిజాలు చెబితే పరువు పోతుందంటే.. చెప్పకపోతే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఉందన్నారు సీఎం రేవంత్. అందుకే వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు.
శ్వేతపత్రంపై తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు
శ్వేతపత్రంలోని అంశాలపై హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్వేతపత్రం తప్పులతడకగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనబడుతోందని ఆరోపించారు. శ్వేతపత్రంలో ప్రజలు, ప్రగతి కోణం లేదన్నారు. ఇందులో రాజకీయ ప్రత్యర్థులపై దాడి.. వాస్తవాల వక్రీకరణే ఉందని విమర్శించారు. దీన్ని తెలంగాణ అధికారులు తయారు చేయలేదన్నారు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక.. సస్పెండ్ అయిన ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారని హరీశ్ అన్నారు.
సాధారణంగా అప్పులు, జీఎస్ డీపీ నిష్ఫత్తిని ప్రగతికి కొలమానంగా తీసుకుంటారని.. వాటిని నివేదికలో చూపించలేదన్నారు. అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో మనం కింద నుంచి ఐదో స్థానంలో ఉన్నామని ఆర్బీఐ చెప్పిందన్నారు. కర్ణాటక, రాజస్థాన్ కూడా మనకంటే ఎక్కువ అప్పులు తీసుకున్నాయన్నారు హరీశ్ రావు. ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రాలేదన్నారు. భవిష్యత్ తరాల కోసం ఆస్తుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. అప్పులు తెచ్చి.. రాష్ట్రంలో ఆస్తులు సృష్టించామని హరీశ్ రావు తెలిపారు. ఎక్కువ మూలధన వ్యయం చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. తెలంగాణ అప్పుల గురించి చెప్పి.. రాష్ట్ర పరువు తీస్తున్నారని అన్నారు.
