తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ప్రధానమైనది- ధరణి పోర్టల్. రైతులు ఎదుర్కొంటోన్న భూసంబంధిత సమస్యలను పరిష్కరించడానికి భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ ఇది. దీనిపై సుదీర్ఘకాలంగా పెద్ద వివాదం నడుస్తూ వస్తోంది.
ధరణి పోర్టల్ వల్ల ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, భూములు ఉన్న రైతులు తమ పేర్లను ఇందులో రిజిస్టర్ చేయించుకోలేక పోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో సమయంలో ప్రకటించారు రేవంత్ రెడ్డి.
ప్రజాదర్బార్లో సైతం దీనికి ఫిర్యాదులు అందాయి. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికం ధరణి పోర్టల్కు సంబంధించనవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమకు భూమి ఉన్నా ధరణి పోర్టల్లో రిజిస్టర్ కావట్లేదని, తప్పుగా నమోదయ్యాయని, వాటిని సరి చేయించాలంటూ డిమాండ్లు, విజ్ఞప్తులు అందాయి.
ఈ క్రమంలో ధరణి పోర్టల్ పని తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ఆయా మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
ప్రజా దర్బార్ సహా ఇప్పటివరకు ధరణి పోర్టల్పై అందిన సమస్యలను క్రోడీకరించి వాటిని సత్వరంగా పరిష్కారించాలని రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిటీ వేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కమిటీ వేయడానికి గల ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.
రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ సమీక్ష సందర్భంగా సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయంపై ఓ నివేదికను అందజేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే- నెలకోసారి మండల కేంద్రాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని, ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలపై సత్వర పరిష్కారాన్ని చూపాలని అన్నారు.
