పవన్ కల్యాణ్ చంద్రబాబు పక్కన లేడని ఇవాళ చెబితే ఒక్క అభ్యర్ది తుపాకీ గుండుకు కూడా దొరకడని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఎల్లోమీడియా వార్తలతో చంద్రబాబు భ్రమలలో బతుకుతున్నారని, కాపు సామాజిక వర్గం ఓట్లుపడితే తప్ప రాజకీయం చేయలేననే పరిస్దితిలోకి చంద్రబాబు వెళ్ళారని ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్ ను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, 2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కలసిరాకపోతే చంద్రబాబుకు పోటీచేసే ధైర్యం లేదన్నారు. చంద్రబాబుకు ఏ ఎన్నికల్లో కూడా సొంతంగా పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవని గుర్తుచేశారు.
రాష్ట్రంలో టీడీపీకి 175 నియోజకవర్గాలలో అభ్యర్దులు ఉన్నారో లేదో తెలియని పరిస్దితి ఉందని సజ్జల పేర్కొన్నారు. 2014-2019 మధ్య ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు ధ్వంసం చేశారని, అందుకే ఆయన్ను ప్రజలు 2019లో ధ్వంసం చేశారన్నారు. ఇప్పుడు జగన్ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ అభివృధ్ది దిశగా వెళ్తున్నారన్నారు్. వైయస్సార్ సిపి అసెంబ్లీ సమన్వయకర్తల మార్పు ప్రణాళికా బధ్దంగానే జరుగుతున్నాయని, చిన్నచిన్న అసంతృప్తులు ఉన్నా అవన్నీ త్వరలోనే సర్దుకుంటాయన్నారు.
పార్టీ కార్యకర్తల నుండి నేతల వరకు అందరినీ జగన్ అక్కున చేర్చుకున్నారని, పార్టీ అధినేత మాట కాదనే వారు ఎవరూ ఉండరని అసంతృప్తులను ఉద్దేశించి సజ్జల తెలిపారు. అభ్యర్దుల ఎంపికకు సంబంధించి చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నప్పటికి అన్నీ సర్దుకుంటాయన్నారు. మఖ్యంగా వైఎస్సార్ సీపీ నాయకులు పదవులను బాధ్యతగానే భావిస్తారన్నారు. ఎల్లో మీడియా టీడీపీ గురించి రాయటానికి ఏమీలేక వైసీపీ అంతర్గత విషయాల గురించి అదే పనిగా రాస్తోందన్నారు.
నియోజకవర్గ ఇన్చార్జ్ లను మార్చినంత మాత్రాన ప్రస్తుతం ఉన్న ఇన్ ఛార్జ్ ల విలువను తగ్గించడంలా భావించకూడదని సజ్జల స్పష్టం చేశారు. వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందన్నారు.ఇంకా మెరుగైన ఫలితాల కోసమే కొన్నిచోట్ల అభ్యర్దులను మార్చడం జరుగుతుందన్నారు. ఇంఛార్జ్ లుగా తప్పించినసందర్బంలో బాధ,ఆవేదన వస్తాయని, అందులో సందేహం లేదన్నారు. వారిని కూర్చోపెట్టి మాట్లాడతామన్నారు. తమకు వ్యవస్దాగతమైన శక్తిసామర్ద్యాలు ఉన్నాయన్నారు.
మరోవైపు ఏపీ ఎన్నికలలో షర్మిల కాంగ్రెస్ తరపున వస్తారన్న ప్రచారంపై స్పందిస్తూ.. ఏ రాజకీయపార్టీ ఐనా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పించిందన్నారు. ఎవరు ఉన్నా అందరూ కలసి వచ్చిన ఫేస్ చేయగలమన్నారు. . ఫేస్ చేసి అందరికంటే మిన్నగా భారీ మెజారిటీతో ప్రజల ఆశీస్సులు పొందగలమన్నారు. తమ టీం చాలా ఫర్ ఫెక్ట్ గా ఉందన్నారు. గతంలో షర్మిల తెలంగాణాలో ఉండాలని నిర్ణయించారని, అదే నిజమని అనుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ నేతలవి ఊహాగానాలు కావచ్చన్నారు. వారికి ఏదైనా సమాచారంతో మాట్లాడి ఉండవచ్చన్నారు
