వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకనుగుణంగా అధికారంలోకి రావడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే జనసేనతో పొత్తు ఖరారైంది. దీనితర్వాత ఆ పార్టీ మరో అడుగు ముందుకేసింది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుడైన ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలతోపాటు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది.
గత ఎన్నికల్లో సామాజిక తంత్రాన్ని ఉపయోగించి వైసీపీ అధికారంలోకి రావడానికి పీకే దోహదపడ్డారు. ఆ సమయంలోనే అతన్ని ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీద్వారా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అప్పట్లోనే పీకేను కలిశారు. అప్పటికే బీహార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసురాజ్ పేరుతో పాదయాత్ర చేస్తుండటంతో ఎన్నికల సమయంలో సేవలందిస్తానని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం టీడీపీకి రాబిన్ శర్మ టీం వ్యూహకర్తగా వ్యవహరిస్తోంది. గతంలో పీకే టీంలోనే రాబిన్ శర్మ పనిచేశారు.
Prashant Kishore is tdp election strategist?
ఇటీవలే హైదరాబాద్ లో ప్రశాంత్ కిషోర్ తో రాబిన్ శర్మ సమావేశమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఎక్కువ రోజులు ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్ ఆ సమయంలో కూడా పీకేను కలిసినట్లు సమాచారం. అప్పటి నుంచే రాష్ట్రంలో పీకే టీం, రాబిన్ శర్మ టీం కలిసి పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పీకే తన మనసు మార్చుకొని తెలుగుదేశం పార్టీకి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల తర్వాత.. ఏపీలో రాబిన్ శర్మతో కలిపి వ్యూహాలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఈ విషయం పార్టీ శ్రేణులకు తెలియకపోవడం గమనార్హం. రాబిన్ శర్మ టీంలో తన బృందాన్ని కలిపి కథ నడిపిస్తున్న పీకే టీడీపీని అధికారంలోకి తీసుకువస్తారా? లేదా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది.
