మిఛౌంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిశాయి. పెద్ద ఎత్తున పంట నీటి పాలయింది. పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంట నష్టం వివరాలు నమోదు చేస్తోంది. దీనికి సంబంధించిన అంచనాలు రూపొందించి, రైతులకు పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడీ ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించింది.
పొరుగునే ఉన్న తమిళనాడులోనూ ఇదే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. చెన్నై నగరం మూడు రోజులుగా వరదనీటిలోనే నానుతోంది. అనేక ప్రాంతాల్లో ఇంకా నీటిలోనే ఉన్నాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను తీసుకుంటోంది. కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్పట్టు.. వంటి ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది.. తుఫాన్ ప్రభావం వల్ల.
Centre released Rs 493 crores of SDRF share to Andhra Pradesh
ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం ఏపీకి తీపి కబురు ఇచ్చింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ విభాగాన్ని పర్యవేక్షిస్తోన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదం తెలిపింది.
రాష్ట్ర విపత్తు నిర్వహణ కింద తక్షణ చర్యలను చేపట్టడానికి అవసరమైన నిధులను మంజూరు చేసింది. దీని విలువ 493.60 కోట్ల రూపాయలు. రెండో విడతగా ఈ నిధులను విడుదల చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. గతంలో ఏపీ వాటాగా 493 కోట్ల రూపాయలు చెల్లించిన విషయం తెలిసిందే. అదే సమయంలో మిఛౌంగ్ తుఫాన్ బారిన పడ్డ తమిళనాడుకు 450 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఈ మొత్తంతో సహాయక పునరావాసాన్ని కల్పించాల్సి ఉంటుంది. రోడ్ల మరమ్మతు, విద్యుత్ పంపిణీ- డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపర్చడం, మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడం వంటి పనులను చేపట్టాల్సి ఉంటుంది. వరద నీటి కాల్వల్లో పూడిక తీత పనులను నిర్వహించాల్సి ఉంటుంది.
