ఫోర్బ్స్ భారత దేశ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఫోర్బ్స్ భారతదేశ టాప్ 100 సంపన్నుల జాబితాను వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ 2023 ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.
మొత్తం 100 మంది సంపన్నుల జాబితాలో 92 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఆయన టాప్ లో నిలిచారు. మళ్ళీ ఆయన ప్రధమ స్థానాన్నే తిరిగి సంపాదించుకున్నారు.
మొత్తం భారతదేశ సంపన్నుల విషయానికి వస్తే మొత్తం 100 మంది భారతదేశ సంపన్నుల ఆస్తుల నికర విలువ ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 799బిలియన్ గా ఉంది. గతంలో గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ కంటే ముందు వరుసలో ఉండగా, హిండెన్ బెర్గ్ నివేదికల తర్వాత అదానీ గ్రూప్ సంస్థలు అస్థిరతకు లోనై క్షీణతను ఎదుర్కొన్నాయి. దీంతో అదానీ గ్రూప్ సంస్థల నికర విలువ ఆ సమయంలో దారుణంగా పడిపోయింది.
ప్రస్తుతం అదానీ సంస్థలు కాస్త కోలుకున్నప్పటికీ అదానీ ఆస్తుల నికర విలువ 68 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో అదానీ రెండో స్థానంలో నిలిచారు. ఇక ఫోర్బ్స్ జాబితాలో, సాఫ్ట్వేర్ దిగ్గజం శివ్ నాడార్ 29.3 బిలియన్ డాలర్ల సంపదతో మూడవ స్థానంలో ఉన్నారు. సావిత్రి జిందాల్ 24 బిలియన్ డాలర్ల నికర విలువతో నాలుగవ స్థానంలో ఉన్నారు.
రాధాకిషన్ దమాని ఆస్తుల నికర విలువ 23 బిలియన్ డాలర్లు గా ఉంది. ఆయన అయిదవ స్థానంలో ఉంది. సైరస్ పూనావల్ల ఆరవ స్థానంలో 20.7 బిలియన్ డాలర్లు సంపదతో నిలిచారు. ఇక భారతదేశంలోని సంపన్నులలో హిందూజా కుటుంబం 20 బిలియన్ డాలర్లతో ఏడవ స్థానంలో ఉంది.
దిలీప్ షాంఘ్వీ 19 బిలియన్ డాలర్ల నికర విలువతో ఎనిమిదవ స్థానంలో ఉండగా, కుమార్ బిర్లా 17.5 బిలియన్ల డాలర్ల నికర విలువతో 9వ స్థానంలో ఉన్నారు. ఇక షాపూర్ మిస్త్రీ అండ్ కుటుంబం 16.9 బిలియన్ డాలర్ల నికర విలువతో పదవ స్థానంలో నిలిచారు. ఇక భారతదేశ 100 మంది సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ ఆసియా అక్టోబర్ సంచికలో మరియు ఫోర్బ్స్ ఇండియా డిసెంబర్ సంచికలో చూడవచ్చు.
