హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ డివిజన్గా ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మొన్నటి వరకు ములుగు రెవెన్యూ డివిజన్లో ఏటూరు నాగారం మండలం కొనసాగగా.. స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ములుగు డివిజన్లో గోవిందరావుపేట, వెంకటాపూర్, ములుగు మండలాలతో పాటు నూతనంగా ఏర్పాటయ్యే మల్లంపల్లి మండలం ఉండనుంది.
కాగా, ములుగు మండలంలో అంతర్భాగంగా ఉన్న మల్లంపల్లి గ్రామాన్ని.. మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక మండలంగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నది.
తెలంగాణలో మరో కొత్త మండలం
తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పాటుకానుంది. నిర్మల్ జిల్లాలోని బీరవెల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వం తాజాగా ప్రైమరీ ఉత్తర్వులు జారీ చేసింది. పైరమూర్, తాండ్రా, వైకుంఠాపూర్, బీరవెల్లి, కంకట, వంజార్, చించోలి(ఎం), జ్వెలి, కల్వ గ్రామాలతో కలుపుతూ మండలంగా ఏర్పాటు చేయనుంది. మొన్నటి వరకు ఆయా గ్రామాల్లన్నీ సారంగాపూర్ మండలాల్లో కొనసాగుతుండగా.. కల్వ గ్రామం మాత్రం దిలావర్పూర్ మండలంగా కొనసాగుతోంది.
కాగా, బీరవెల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేయడంపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పత్రిపాదిత మండలానికి చెందిన ప్రజలు మంత్రినికి కలిసి ధన్యవాదాలు చెప్పారు. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం రెండు డివిజన్లు, 19 మండలాలున్నాయి.
