హమాస్ ఉగ్రదాడుల్లో 200 మందికి పైగా ఇజ్రాయెలియన్లు దుర్మరణం: ఆందోళనలో భారతీయులు

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు.

రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.

స్థానిక కాలమనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఆరంభమైన హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో 200 మందికి పైగా ఇజ్రాయెలియన్లు మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానిక హిబ్రూ మీడియా తెలిపింది. రాకెట్ దాడుల్లో వెయ్యిమందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది.

తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

గాజా సరిహద్దు వెంబడి ఉన్న ఇజ్రాయెల్‌లోని అనేక స్థానాలను హమాస్ ఉగ్రవాదులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అక్కడ తమ చేతికి చిక్కిన ఇజ్రాయెలీలను గాజా స్ట్రిప్‌కు తరలించడం మొదలు పెట్టారు. గాజా స్ట్రిప్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఇజ్రాయెల్ టౌన్.. షార్ హనెగెవ్‌పై తమ దాడులు తీవ్రతరం చేశారు. పెద్ద ఎత్తున రాకెట్లను సంధించారు.

ఈ దాడుల్లో షార్ హనెగేవ్ రీజియన్ మేయర్ ఓఫిర్ లిబ్‌స్టెయిన్.. దుర్మరణం పాలయ్యారు. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది.

ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్పారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

దాడులు- ప్రతిదాడులతో అటు ఇజ్రాయెల్, ఇటు గాజా స్ట్రిప్, పాలస్తీనాలోని పలు ప్రాంతాల్లో అట్టుడికిపోతున్నాయి. రాకెట్ల ప్రయోగాలు, వైమానిక దాడులతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాము యుద్ధం చేస్తోన్నామంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సైతం ప్రకటించడం చర్చనీయాంశమైంది.

ఈ పరిణామాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అవసరమైన తక్షణ నిర్ణయాలను అప్పటికప్పుడు తీసుకుంటోంది. ఇందులో భాగంగా- ఇజ్రాయెల్‌లో నివసించే భారతీయుల కోసం ప్రత్యేకంగా ఓ అడ్వైజరీని జారీ చేసింది కేంద్రం. ఇజ్రాయెల్‌లో నివసించే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దని పేర్కొంది. స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేసే సేఫ్టీ ప్రొటోకాల్స్‌ను పాటించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్లు వదిలి బయటికి వెళ్లకూడదని కోరింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రక్షణ కావాల్సి వస్తే https://www.oreaf.org.il/en వెబ్‌సైట్‌ను సందర్శించాలని,

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు 97235226748 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయంతో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, భారత్‌లో నివసించే వారు తమ ఆప్తుల పట్ల ఎలాంటి ఆందోళనలు పెట్టుకోనక్కర్లేదని, రక్షణ చర్యలు తీసుకుంటోన్నామని వివరించింది.

YES9 TV