స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజి పాత్రను స్మరించుకుందాం..

అక్టోబర్ 2.. గాంధీజయంతి.. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ పాత్రను స్మరించుకోవాల్సిన రోజుది. గాంధీ జయంతి విశిష్టతలు నేటి భావితరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సహనం, సత్యం అనే మార్గాన్ని అనుసరిస్తే కష్టతరమైన పోరాటాల్లో విజయం సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి మహాత్మగాంధీ. ఏదో సినిమాలో చెప్పినట్టు కొంతమంది ఇంటిపేరు కాదురా గాంధీ, ఊరికొక్క ఇంటిపేరు గాంధీ, కరెన్సీ నోట్ మీద, నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధీ.. నిజానికి గాంధీ అనేది పేరు కాదు…ఓ సిద్ధాంతం. కొన్ని తరాలకు అవసరమైన విలువల్ని చాటి చెప్పిన వ్యక్తి మహాత్మా గాంధీ. దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి భారతావనికి స్వాతంత్ర్యాన్ని అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమికొట్టడానికి ఆయన అహింస, శాంతిని ఆయుధాలుగా చేసుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రతి ఒక్కరిలో రగిల్చేందుకు దేశంలో అనేక ప్రాంతాల్లో పర్యటించారు. మహాత్మా గాంధీ ఆలోచనలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలోనే కాదు.. ఆయన మాటలు విదేశాల్లోని ప్రజలపై కూడా ఎంతో ప్రభావం చూపించాయి. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన గురించిన విశేషాలు..

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీగా నామకరణం..:1869లో గుజరాత్ లోని పోర్ బందర్ లో కరంచంద్ గాంధీ, పుత్లీబాయి గాంధీ పుణ్య దంపతులకు మహాత్మా గాంధీ జన్మించారు. తండ్రి పేరు కరంచంద్ గాంధీని కలుపుకుని ఆయనకు మోహన్ దాస్ కరంచంద్ గాంధీగా నామకరణం చేశారు. న్యాయవాది విద్యను అభ్యసించి న్యాయవాద వృత్తిని చేపట్టిన గాంధీ వృత్తిజీవితంతో సరిపెట్టుకోకుండా పుట్టిన గడ్డకు విముక్తి కల్పించేందుకు, భరత మాతను బ్రిటిషర్ల సంకెళ్ల నుంచి విడిపించేందుకు నడుం బిగించారు.

మహాత్మాగాంధీ పేరు పెట్టిన గ్రామం..:మహాత్మాగాంధీ పేరు పెట్టిన గ్రామం మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో ఉంది. ఆ గ్రామం పేరు సేవాగ్రాం. నాగ్ పూర్ నుండి సుమారు 77 కిలోమీటర్ల దూరంలో వార్ధా నుండి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. సేవాగ్రాం అంటే ‘సేవకోసం ఉన్న ఊరు’ అని అర్థం. గాంధీ 1934లో ఈ ఊరికి వచ్చినప్పుడు ఆ పేరు పెట్టారు. అంతకు పూర్వం దీనిని ‘షేగావ్’ అని పిలిచేవారు.

గాంధీ జయంతి నాడే.. ప్రపంచ అహింసా దినోత్సవం..:ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్మా గాంధీ సిద్ధాంతాలను గౌరవిస్తూ, ఆయన అనుసరించిన అహింసా మార్గంలో నడుస్తూ, ఆయన్ని స్మరించుకునే లక్ష్యంతో ప్రపంచ దేశాలు కూడా గాంధీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. 2007లో యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 2 గాంధీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవంగా పరిగణించాల్సిందిగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు గాంధీ జయంతిని క్రమం తప్పకుండా ఒక అధికారిక కార్యక్రమంగా నిర్వహించుకుంటున్నాయి.

సేవాగ్రాం ఆశ్రమంలోనే బాపు కుటీరం..:సేవాగ్రాం ఆశ్రమం గాంధీజీ జీవన విధానానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. తన భార్య కస్తూర్బా గాంధీతో కలిసి ఆయన నివసించిన కుటీరం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బాపూజీ 1934 నుండి 1940 వరకు ఇక్కడే ఆశ్రమం నిర్మించుకొని నివసించాడు.

సాధారణ ప్రజలు నివశించే విధంగానే కరెంటు లేకుండా, ఫోన్ సౌకర్యం లేకుండా నిరాడంబర జీవనాన్ని గడిపాడు. ఎటువంటి సదుపాయాలు లేకుండానే బాపూజీ ఇక్కడ గడిపారు. బాపూజీ వంటగదిని చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఆశ్రమాన్ని సందర్శించొచ్చు. ఇలా ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి మన జాతిపిత. బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చెప్పిన కొన్నిసూక్తులను స్మరించుకుందాం.

YES9 TV