భువనేశ్వరి బస్సు యాత్ర?- అక్కడి నుంచి

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.

ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలనూ తలపెట్టింది. కొవ్వొత్తుల ర్యాలీలు, ప్లకార్డుల ప్రదర్శనలు, పోస్ట్ కార్డుల ఉద్యమాలతో చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా- మోత మోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించింది. చంద్రబాబుకు మద్దతు తెలియజేస్తూ శనివారం సాయంత్రం రాత్రి 7 నుంచి 7:05 నిమిషాల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక తాజాగా- సత్యాగ్రహ దీక్షకు పూనుకోనుంది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఈ దీక్షను చేపట్టింది టీడీపీ.

దీనితో పాటు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనుంది టీడీపీ. దీనికోసం నారా భువనేశ్వరి స్వయంగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 5వ తేదీన ఆమె కుప్పం నుంచి బస్సు యాత్రను చేపడతారని తెలుస్తోంది. దీనికి అవసరమైన రోడ్ మ్యాప్‌ను ఇప్పటికే సిద్ధం చేశారని చెబుతున్నారు. దశలవారీగా రాష్ట్రం మొత్తం పర్యటించేలా ఈ రోడ్ మ్యాప్ రెడీ అయిందని సమాచారం.

బస్సు యాత్ర ఉంటుందా? లేదా? అనేది చంద్రబాబు బెయిల్‌, క్వాష్ పిటీషన్‌పై ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి. చంద్రబాబుకు బెయిల్ లభిస్తే.. నారా భువనేశ్వరి బస్సు యాత్ర ఉండదని, ఇక ఆయనే స్వయంగా దీన్ని నిర్వహిస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. బెయిల్ లభించక, జ్యుడీషియల్ కస్టడీని పొడిగించే పరిస్థితి ఏర్పడితే మాత్రం భువనేశ్వరి రోడ్డెక్కుతారని తెలుస్తోంది.

దీనికోసం ఈ నెల 4వ తేదీన భువనేశ్వరి కుప్పానికి బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది. ఈలోగా బెయిల్ లభిస్తే బస్సు యాత్ర రద్దవుతుంది. లేదంటే ఆ మరుసటి రోజు నుంచి బస్సు యాత్రను చేపడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలిదశలో రాయలసీమ జిల్లా ఆమె పర్యటిస్తారని సమాచారం.

ఇదివరకు చంద్రబాబు బస్సు యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల.. వంటి జిల్లాల్లో చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.

YES9 TV