టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. స్కిల్ స్కాం కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు.

చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనల కొనసాగిస్తున్నారు. అటు సుప్రీం నుంచి ఏసీబీ కోర్టు వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ నేత రఘువీరా ఈ అరెస్ట్ వెనుక బీజేపీ ఉందంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

రఘువీరా వ్యాఖ్యలు : బీజేపీ ఒత్తిడితోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ భుజంపై బీజేపీ తుపాకీ పెట్టి వ్యవహారాలు నడిపిస్తోందని ఆరోపించారు. టీడీపీ నిరసనలు, ఉద్యమాలు ఎన్ని చేపట్టిన ప్రయోజనం శూన్యమన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి టీడీపీ కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలన్నారు. బీజేపీ, ప్రధాని మోదీ, అమిత్ షాలకు తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరగదని పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ బలపడాలనుకోవటమే వీటి వెనుక కారణమని చెప్పుకొచ్చారు.

బీజేపీ నేతల ప్రమయంపై : ఇప్పటికే వామపక్షాల నేతలతో పాటుగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఏం జరుగుతుందో బీజేపీకి తెలియదా అంటూ అయ్యన్న వ్యాఖ్యానించారు. అదే విధంగా మాజీ ఎంపీ హర్షకుమార్..తెలంగాణ మంత్రి మల్లారెడ్డి వంటి నేతలు నేరుగా బీజేపీ పైన ఆరోపణలు చేసారు. ఇదే సమయంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రం ఈ అరెస్ట్ తో బీజేపీకి సంబంధం లేదన్నారు. అరెస్ట్ ను బీజేపీ ఖండించిందని చెప్పారు. అయితే, బీజేపీ ముఖ్య నేతలు ఎవరూ చంద్రబాబు అరెస్ట్ పైన ఇప్పటి వరకు స్పందించలేదు. అదే సమయంలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ ఇటు టీడీపీతో పొత్తు పైన ప్రకటన చేసారు.

రాజకీయ ఉత్కంఠ : టీడీపీ, జనసేన పొత్తు పైన ప్రకటన చేసిన పవన్..తమతో బీజేపీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తాను ఏ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ప్రకటన చేయాల్సి వచ్చిందీ బీజేపీ ముఖ్య నేతలు వివరణ ఇస్తానని స్పష్టం చేసారు. చంద్రబాబు అరెస్ట్ అయి 20 రోజులు అవుతున్నా పవన్ బీజేపీ నేతలతో చర్చించలేదని సమాచారం. ఇదే సమయంలో మరో రెండు రోజుల్లో పవన్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. అటు లోకేశ్ పైన కేసుల్లోనూ కోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. అటు సీఐడీ స్కిల్ కేసులో విచారణకు లోకేశ్ కు నోటీసులు ఇవ్వనుంది. దీంతో, ఇప్పుడు ఈ వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.

Posted Under AP
YES9 TV