టీడీపీ నేత నారా లోకేశ్(Nara Lokesh) యువగళం(yuvagalam) పై ఉత్కంఠ కొనసాగుతోంది. లోకేశ్ తన పాదయాత్రను రేపు (శుక్రవారం) తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు.
కానీ, ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించటం లేదు. మరోసారి వాయిదా పడనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఐడీ(CID) నమోదు చేసిన కేసులో హైకోర్టులో లోకేశ్ బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. ఇటు టీడీపీ(TDP) పొలిటికల్ యాక్షన్ కమిటీ నంద్యాలలో సమావేశం కానుంది. ఇందులో తాజా నిర్ణయాలు ప్రకటించనున్నారు.
నిలిచిన యువగళం : చంద్రబాబు అరెస్ట్ తో ఈ నెల 9న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. చంద్రబాబు(Chandra Babu)ను కోర్టులో హాజరు పరిచిన సమయం నుంచి రిమాండ్ లో భాగంగా రాజమండ్రి జైలుకు తరలించే వరకూ లోకేశ్ తన తండ్రితోనే ఉన్నారు. జైలులో రెండు సార్లు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆ తరువాత ఢిల్లీ(Delhi)కి వెళ్లారు. అక్కడ జాతీయ స్థాయిలో చంద్రబాబు కేసుల గురించి వివరించటంతో పాటుగా తాజాగా రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఇటు ఏసీ సీఐడీ (AP CID)అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేశ్ ను ఏ-14గా చేర్చింది. దీంతో, లోకేశ్ ఈ కేసులో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. రేపు దీని పైన విచారణ జరగనుంది.
సీఐడీ కేసుతో..బెయిల్ కోసం : ఇదే సమయంలో లోకేశ్(Lokesh) ను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కొద్ది రోజుల క్రితం ఏపీ మంత్రులు సైతం లోకేశ్ అరెస్ట్ ఖాయమని చెప్పుకొచ్చారు. అరెస్ట్ నుంచి తప్పించుకొనేందుకే లోకేశ్ ఢిల్లీలో ఉన్నారని తాజాగా మంత్రులు ఆరోపణలు చేసారు. ఈ సమయంలోనే తాను తిరిగి ఈ నెల 29వతేదీ రాత్రి నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని లోకేశ్ ప్రకటించారు. తన యాత్ర ప్రకటనతోనే తన పైన కేసు నమోదు చేసారని..అసలు అమరావతి కేసు (Amaravati INgger Ring Road Case)తో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేయాలనుకుంటే ఢిల్లీలోనే చేయవచ్చని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో చంద్రబాబు సుప్రీం(Supreme Court)లో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ అక్టోబర్ 3న విచారణకు రానుంది. అటు ఏసీబీ కోర్టులో బెయిల్ పైన విచారణ అక్టోబర్ 4న జరగనుంది.
టీడీపీ నేతల కీలక భేటీ : దీంతో, లోకేశ్ ఈ నెల 29న ప్రారంభించాలని భావించిన పాదయాత్ర మరో వారం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో రేపు నంద్యాల(Naandyala)లో పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. కమిటీ సమావేశంలో ఢిల్లీ నుంచి జూమ్లో లోకేష్ పాల్గొననున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రాంతంలోనే సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటు హైకోర్టు(High Court)లో లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో లోకేశ్ పాదయాత్ర అక్టోబర్ 4 తరువాత ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
