వైభవంగా భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం జరుగుతోంది. 11 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్(Khairtabad) మహాగణపతి శోభాయాత్ర(Shoba Yatra) ఈ ఉదయమే మొదలైంది.
షెడ్యూల్ కంటే ముందుగానే ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేష్ చరిత్రలోనే తొలిసారిగా మధ్నాహ్నం సమయానికే నిమజ్జన ప్రక్రియ పూర్తయింది. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు గణపతికి వీడ్కోలు పలికారు. నగరం వ్యాప్తంగా భారీగా గణనాధులు సాగర తీరం వైపు తరలి వస్తున్నారు.
కొనసాగుతున్న నిమజ్జనం : భారీ భక్త జన సందోహం మధ్య ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. పోలీసులు ఈ సారి పక్కా ప్రణాళికతో ముందుగానే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి సూచనలు చేసారు. దీంతో, ఈ రోజు ఉదయం శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్నాహ్నం సమయానికి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో జంట నగరాల్లోని వినాయక నిమజ్జనం ముగిశాక చివరిలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉండేది. చివరిలో బడా గణేష్ నిమజ్జనం పెట్టుకుంటే ఇబ్బంది తలెత్తుతోందని ముందుగానే నిర్వహించారు. కాగా.. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రలో బ్యాండ్కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇక బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు కూడా ప్రారంభమైంది.
సాగర తీరం జనసంద్రం : ఇక వీధి వీధినా కొలువైన గణనాథులు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. మహా నిమజ్జన ఘట్టం పనులు మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభం అయింది. శోభాయాత్రకు అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ “శ్రీ దశ మహా విద్యాగణపతి” నిమజ్జన శోభాయాత్ర నేడు ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై..టెలిఫోన్ భవన్, ఎన్టీఆర్ మార్గ్ ..సచివాలయం మీదుగా క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకుంది. అక్కడ భారీగా భక్తులు అప్పటికే చేరుకున్నారు. ఎక్కడా ఖైరతాబాద్ వినాయకుడు యాత్రకు అడ్డు లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా మధ్నాహ్నం 1.30 గంటలకు గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు.
కొనసాగుతున్న శోభాయత్ర : ట్యాంక్బండ్ నుంచి అబిడ్స్ వరకు గణేశుడి వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పాతబస్తీ, సికింద్రాబాద్ నుంచి వినాయక విగ్రహాలు తరలివస్తుండడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది.ఒక్కసారిగా నలు మూలల నుంచి గణపతి విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు వస్తుండడంతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో యువత తరలి వచ్చారు. అందరూ శోభా యాత్రలో స్టెప్పులు వేస్తూ సందడి చేసారు. కొందరు తీన్మార్ డాన్స్ లతో ఆకట్టుకున్నారు. కొందరు పోలీసు సిబ్బంది వారితో కలిసి డాన్స్ చేసారు. భాగ్యనగరం మొత్తం శోభాయాత్రతో సందడి వాతావరణం కనిపిస్తోంది. రేపు ఉదయం వరకు నిమజ్జనం కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
