హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు జమిలి వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగినప్పటికీ..
ఆ ప్రక్రియ ఇప్పట్లో జరిగేలా లేదు. దీంతో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక విషయాలను పంచుకున్నారు.
ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగిందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వికాస్ రాజ్ తెలిపారు. సమ్మరి రవిజన్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఈవీఎంలన్నింటినీ చెక్ చేశామని, అధికారుల శిక్షణ కోసం ఈవీఎంలను తెప్పించామని చెప్పారు. బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను సీఈవో వికాస్ రాజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వికాస్ రాజు మాట్లాడుతూ.. అక్టోబర్ నెలలో ఎన్నికలకు అవసరమైన డిస్టిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల వంటివి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను గుర్తించడం, వారికి శిక్షణ ఇవ్వడం, పోలింగ్ స్టేషన్లు పరిశీలించి ఈసీఐ సూచనల ప్రకారం ఆయా ప్రాంతాల్లో కనీస మౌలిక సౌకర్యాలు ఉన్నాయా. లేదా వంటివి పరిశీలించి.. కల్పిస్తున్నామని తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాలను గుర్తించడంతోపాటు, కేంద్ర బలగాలకు వసతి, రవాణా సౌకర్యం, వారికి విధుల కేటాయింపు వంటి అంశాలపై దృష్టి సారించామన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, ఈవీఎంల ర్యాండమైజేషన్ తదితర ఏర్పాట్లు, శిక్షణ కొనసాగుతున్నాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల కొత్త ఓట్లు నమోదయ్యాయని, 3 లక్షల ఓట్లు రద్దయ్యాయని వికాస్ రాజ్ తెలిపారు.
ఫారం-6, 8లు 15వేలకుపైగా వచ్చాయన్నారు. ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. 6.99 లక్షల మంది యువ ఓటర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. మరోవైపు, అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రానుందని వికాస్ రాజ్ తెలిపారు.
కేంద్ర బృందం రాష్ట్రంలోని రాజకీయ నాయకులతోపాటు సీఎస్, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమవుతుందని ఆయన తెలిపారు.
