హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న కాకుండా అక్టోబర్ 1న ఆయన రాష్ట్రానికి రానున్నారు.
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ప్రచారాన్ని వేగవంతం చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.
క్షేత్రస్థాయి కీలక కార్యాచరణకు సెప్టెంబర్ నెలాఖరులోపు తుదిరూపు ఇచ్చి అక్టోబర్లో ప్రధాని సహా అగ్రనేతల సభలు, అభ్యర్థుల ప్రకటన వంటి కీలక అంశాలతో ఎన్నికల దిశగా అడుగులేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 1న ప్రధాని మోడీ మహబూబ్నగర్లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.
అనంతరం బీజేపీ అగ్రనేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కీలక నేతలతో బహిరంగ సభలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర బీజేపీ కసరత్తులు చేస్తోంది. కాగా, ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలను భావిస్తున్నవారి నుంచి దరఖాస్తులను తీసుకున్న విషయం తెలిసిదే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల నుంచి 3వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం చర్చలు జరుపుతోంది. అభ్యర్థుల ఖరారు చేసేందుకు మల్లాగుల్లాలు పడుతోంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పు తర్వాత బీజేపీ జోరు తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ కొత్త ఉత్సాహంతో నేతల సమన్వయంతో తెలంగాణలో అధికారం చేపట్టే దిశగా అడుగులు వేయాలని బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసింది. దీంతో మళ్లీ అందరు నేతలు కలిసికట్టుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.
