కేంద్ర మంత్రితో సుమలత మేడమ్ చర్చలు, స్టాలిన్ కు షాక్, అలా చేస్తే రోడ్డున పడుతాం !

తమిళనాడుకు ప్రతిరోజు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

సెప్టెంబరు 13వ తేదీ నుంచి వచ్చే 15 రోజుల పాటు తమిళనాడుకు కావేరి నీటిని వదలాలని ఆదేశించడంతో కర్ణాటక ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కావేరీ జలాల వివాదం నేపథ్యంలో మండ్య స్వతంత్ర పార్టీ ఎంపీ సుమలత అంబరీష్ ఢిల్లీలో కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు. కావేరి నీటిని విడుదల చెయ్యలేని పరిస్థితిని వివరించిన సుమలత రైతుల ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు మనవి చేశారు.

కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చెయ్యకూడదని కర్ణాటక రాష్ట్రంలో రైతులు, ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మండ్య లోక్ సభ ఎంపీ సుమలత ట్వీట్ చేస్తూ గౌరవనీయులైన కేంద్ర మంత్రి, కావేరి వాటర్ అథారిటీ ఛైర్మన్‌ను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యక్తిగతంగా కలుసుకోవాలని, కర్ణాటకలోని విపత్కర పరిస్థితిని వివరించి వారిని ఒప్పించనివ్వండి అని సుమలత మనవి చేశారు.

తమిళనాడుకు నీళ్లివ్వడం ఆపండి, మనమందరం మన రైతులకు అండగా నిలబడదాం అంటూ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన అనంతరం సుమలత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కరువు కారణంగా మండ్య రైతులు అల్లాడుతున్నారని, మండ్య జిల్లా రైతులకు జీవనాడి అయిన కావేరి నీటిని నిత్యం తమిళనాడుకు విడుదల చేస్తున్నారని, ఇక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మండ్య ప్రాంత రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మరో 15 రోజుల పాటు ప్రతిరోజు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ చెప్పడం నిజంగా షాకింగ్ పరిణామం అని, కావేరీ జలాలు ఖాళీ అయితే ఇక్కడి రైతులు ఏం చెయ్యాలని సుమలత విచారం వ్యక్తం చేశారు.

రానున్న కాలంలో రైతుల పొలాలే కాదు, తాగునీరు కూడా అందకుండా నానా ఇబ్బందులు పడుతారని, నేను ఈరోజు ఢిల్లీలో జలవిద్యుత్ శాఖ మంత్రి గౌరవనీయులు గజేంద్ర సింగ్ షికావత్‌ను కలిసి ఈ వాస్తవాలన్నింటినీ వివరించానని, వచ్చే వారంలోగా ఆయా రాష్ట్రాల సంయుక్త కమిటీ వేసి సర్వే నిర్వహించి మన రైతుల పక్షాన నిలబడి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని సుమలత మండ్య రైతులకు హామీ ఇచ్చారు.

వీలైనంత త్వరగా మనకు న్యాయం జరుగుతుందని నమ్మకం నాకుందని మండ్య లోక్ సభ నియోజక వర్గం ఎంపీ సుమలత అంబరీష్ ట్విట్టర్ లో పోస్ట్‌ చేశారు. సోమవారం జరిగిన కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సమావేశం కావేరీ వాటర్ కంట్రోల్ కమిటీ సిఫార్సును ఆమోదించింది.

కమిటీ సూచన మేరకు తమిళనాడుకు ప్రతిరోజూ 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగం ఆదేశించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కావేరి నీటితో కేఆర్ఎస్ తో పాటు సంబంధిత రిజర్వాయర్లు నిండలేదు. తమిళనాడుకు నీటిని తరలించలేమని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించింది.

ఇలాంటి తరుణంలో మళ్లీ కావేరీ జలాలు కావాలని తమిళనాడు కోరడం దుమారం రేపుతోంది. కావేరీ బేసిన్‌లో పెరుగుతున్న కరువును దృష్టిలో ఉంచుకుని, తాగునీరు, సాగునీటి అవసరాల నేపథ్యంలో నీటిని విడుదల చేయలేమని కర్ణాటక అధికారులకు కావేరి వాటర్ మేనేజ్ మెంట్ బోర్డుకు తెలియజేసింది.

కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాల అనంతరం మాట్లాడిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి డీకే. శివకుమార్ కావేరీ నీటిని వదలాలా ?, వద్దా అనే అంశంపై ఆలోచిస్తున్నామని, మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని, తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఏ సమయంలోనైనా ఢిల్లీకి వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కర్ణాటక ఎంపీలు, ముఖ్యమంత్రి త్వరలో తేదీని నిర్ణయించుకుంటారని, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ రాజకీయాలను వీడి కావేరీ జలాల కోసం కర్ణాటక ప్రభుత్వానికి సహకరించాలని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అంటున్నారు.

Editor