చంద్రబాబు కు బెయిల్ దక్కుతుందా. స్కిల్ స్కాంలో క్వాష్ పిటీషన్ పై ఏం జరగనుంది. ఇప్పుడు రాజకీయంగా ఇదే ప్రధాన చర్చగా మారుతోంది. అటు హైకోర్టులో..ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటీషన్ల పైన విచారణ జరగనుంది.
ఈ సమయంలోనే చంద్రబాబు కోసం ఇప్పటికే రంగంలోకి దిగిన సీనియర్ న్యాయవాది లూధ్రాతో పాటుగా మరో ఇద్దరు ఢిల్లీ లాయర్లు ముందుకొచ్చారు. అటు సీఐడీ తరపున పొన్నవోలుతో పాటుగా మరో ఢిల్లీ న్యాయవాది వాదనలకు సిద్దమయ్యారు.
రంగంలోకి ఢిల్లీ లాయర్లు:స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే ఆయన తరపు వాదనలు వినిపించేందుకు సుప్రీం న్యాయవాది లూధ్రా విజయవాడ చేరుకున్నారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టు పైన సీఐడీ తరపున పొన్నవోలు సుధాకర రెడ్డి వాదించారు. ఆ సమయంలో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది.
ఆ వెంటనే ఏపీ హైకోర్టులో లూధ్రా స్కిల్ స్కాం క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. దీంతో పాటుగా రిమాండ్ రిపోర్టు రద్దు చేయాలని కోరారు. ఇదే సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ చంద్రబాబు పై పీటీ వారెంట్ కోసం కోర్టుకు వెళ్తుందనే ప్రచారంతో ఆ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. ఈ పిటీషన్లు ఈ రోజు హైకోర్టులో విచారణకు రానున్నాయి.
హైకోర్టులో నేడు వాదనలు:ఇదే సమయంలో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్పైనా విచారణ జరగనుంది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్పైనా వాదనలు జరిగే అవకాశముంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తరుఫున వాదించేందుకు ముగ్గురు సీనియర్ న్యాయవాదులు రంగంలోకి దిగనున్నారు. రిమాండ్ ఉత్తర్వులు సస్పెన్షన్పై సీఐడీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గి వాదనలు వినిపించే అవకాశం ఉంది.
సిద్ధార్థ లూథ్రాతో పాటు హరీష్ సాల్వే, సిద్ధార్థ అగర్వాల్ చంద్రబాబు తరుఫున వాదనలు వినిపించనున్నారు. అటు కపిల్ సబాల్ తోనూ చర్చలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది. ఈ మధ్నాహ్నం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటీషన్ల పై హైబ్రిడ్ మోడ్ లో విచారణ జరగనుంది. ఈ సమయంలో వీరి వాదనల పైన ఆసక్తి కొనసాగుతోంది.
బెయిల్ నిర్ణయంపై ఉత్కంఠ:చంద్రబాబు తరపు వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టులో పేరున్న ముగ్గురు న్యాయవాదులు రంగంలోకి దిగారు. ఈ కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని, ప్రభుత్వ రాజకీయ కుట్రతో అరెస్ట్ చేసిందని చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే, సీఐడీ మాత్రం చంద్రబాబు ప్రమేయానికి సంబంధించి సాక్ష్యాలు..ఆధారాలతోనే అరెస్ట్ జరిగిందని వాదిస్తోంది.
ఈ క్రమంలో క్వాష్ పిటీషన్ వేళ హైకోర్టులో జరిగే వాదనలు ఈ కేసులో కీలకం కానున్నాయి. అదే విధంగా ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ పైన సీఐడీ కౌంటర్ దాఖలు చేయనుంది. అటు హైకోర్టు..ఇటు ఏసీబీ కోర్టులో జరిగే వాదనలు..నిర్ణయం పైన ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది.
