సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. అనేక సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్న జగన్ ప్రభుత్వం వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపులకు ఆర్థిక సాయం చేస్తుంది.
పార్టీ మేనిఫెస్టోలో లేకున్నా, ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం కాపు నేస్తం పథకాన్ని తీసుకొచ్చింది. కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తూ వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఆర్థిక సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది.
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శనివారం జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేయనున్నారు. అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున అందజేస్తోంది.
ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని కాపులకు అందించనట్లు అవుతుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 52 నెలల్లో 77,00,628 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల లబ్ధిదారులకు డీబీటీ, నాన్-డీబీటీతో రూ.39,247 కోట్ల మేర ఆర్థిక సాయం చేసింది. కాపు కార్పొరేషన్ ద్వారా ఏడాదికి రూ.2 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని విజయవంతంగా అమలు చేస్తోంది.
ఈ రోజు సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి నిడదవోలు బయల్దేరుతారు. అక్కడ సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో వైఎస్సార్ కాపునేస్తం ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
