ఇప్పుడు రాజకీయంగా అందరి చూపు హైదరాబాద్ వైపే. రెండు రోజుల పాటు హైదరాబాద్ జాతీయ కీలక రాజకీయ నిర్ణయాలకు వేదిక కానుంది. కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణయ మండలి సీడబ్ల్యూసీ సమావేశం హైదరాబాద్ లో ఈ రోజు జరగనుంది.
రేపు తెలంగాణ విమోచన, విలీన దినోత్సవంగా భావించే సెప్టెంబర్ 17న సోనియా..కేంద్ర హోం మంత్రి అమిత్ షా వేర్వేరు సభల్లో పాల్గొంటున్నారు. దీంతో, ఒక్క సారిగా హై ఓల్టేజ్ రాజకీయం మొదలైంది.
హైదరాబాద్ కేంద్రంగా: కాంగ్రెస్ వర్సెస్ బిజెపి. పోటాపోటీ రాజకీయానికి హైదరాబాద్ వేదిక మారుతుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఆ వెంటనే హైదరాబాద్ వేదిక ఒకే సమయంలో జరిగే బహిరంగ సభల్లో సోనియా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యే అవకాశముంది.
ఇద్దరు అగ్ర నేతల సభలు ఇప్పుడు రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు ఇప్పుడు తెలంగాణ పైన దృష్టి కేంద్రీకరించాయి. కర్ణాటకలో విజయం తర్వాత తెలంగాణ పైన కాంగ్రెస్ నాయకత్వం ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాలు అమలు చేస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్ వేదిక నిర్వహిస్తుంది.
సోనియా – అమిత్ షా సభలు: సెప్టెంబర్ 17 పైన చాలాకాలంగా వివాదం ఉంది. విమోచన, విలీనం అంటూ రాజకీయంగా వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సరిగ్గా అదే రోజున కాంగ్రెస్ బిజెపి అగ్ర నాయకత్వం హైదరాబాదులో మోహరిస్తుంది. రెండు పార్టీలు హోరాహోరీగా తమ బలం చాటుకునేలా భారీ బహిరంగ సభలకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 17వ తేదీన తుక్కుగూడలో 10 లక్షల మందితో సభకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
అదే రోజున విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు.గత ఏడాది జరిగిన విమోచన వేడుకల్లోనూ అమిత్ షా పాల్గొన్నారు. అయితే 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండటంతో అగ్రనేతల హైదరాబాద్ సభలు ఆసక్తిగా మారాయి. సోనియా గాంధీ బహిరంగ సభకు హాజరు కానుండటంతో తెలంగాణ నుంచి ఎటువంటి సందేశం ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారుతుంది.
జాతీయ రాజకీయాలకు కేంద్రంగా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ రానున్నారు. సీఆర్పీఎఫ్ గెస్ట్హౌస్ లో బస చేస్తారు.బీజేపీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో పాటు ఆమె కుటుంబ సభ్యులను అమిత్ షా కలుస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ తుక్కుగూడలో సభను నిర్వహించాలని నిర్ణయిస్తే, పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలకు బిజెపి సిద్దమవుతుంది.
సాధ్యమైనంత మేర జన సమీకరణ చేయాలని భావిస్తుంది. ఈ రెండు పార్టీల ఓరాహోరీ కార్యక్రమాలు,సభల వేళ బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తుందని ఆసక్తికరంగా మారుతుంది. రెండు పార్టీలకు బీఆర్ఎస్ టార్గెట్ గా మారే ఛాన్స్ కనిపిస్తుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేసే గ్యారెంటీ స్కీములను సోనియా హైదరాబాద్ వేదికగా ప్రకటించనున్నారు.
