కాంగ్రెస్ అగ్రనాయకత్వం హైదరాబాద్ లో మొహరించింది. ఈ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ కార్యచరణ ముమ్మరం చేసింది.
ఇక్కడ నుంచే అటు కేంద్రం..ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వచ్చే ఎన్నికలకు సమరశంఖం పూరించనుంది. ఇదే సమయంలో వైఎస్ షర్మిల తన పార్టీకి అధికారికంగా కాంగ్రెస్ లో విలీనానాకి ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం.
డీకేతో షర్మిల సమావేశం: హైదరాబాద్ కు వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల మరోసారి సమావేశం అయ్యారు. ఇప్పటి వరకు షర్మిల కాంగ్రెస్ లో చేరిక…వైఎస్సార్టీపీ విలీనం వ్యవహారాల విషయంలో డీకే కీలకంగా వ్యవహరిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైన సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేసారు.
పార్టీలో చేరటానికి ఇబ్బంది లేదని..తెలంగాణ బాధ్యతలు అప్పగించవద్దని సూచించారు. షర్మిలకు తెలంగాణ వ్యవహారాల్లో ప్రాధాన్యత ఇస్తే కేసీఆర్ కు అనుకూల అస్త్రంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. దీంతో, షర్మిల వ్యవహారంలో అనేక చర్చలు జరిగాయి. ఏపీలోనూ షర్మిల సేవలు వినియోగించుకోవాలని తొలుత కాంగ్రెస్ నాయకత్వం భావించింది.
సోనియా సమక్షంలో నిర్ణయం: షర్మిల తాను ఏపీకి వెళ్లే ప్రసక్తే లేదని, తెలంగాణకే పరిమితం అవుతానని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇదే సమయంలో కొద్ది రోజుల క్రితం నేరుగా ఢిల్లీలో సోనియా, రాహుల్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో జరిగిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో సీబీఐ నాడు ఎఫ్ఐఆర్ లో వైఎస్సార్ పేరు ప్రస్తావన పైన స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ పరిణామం కాంగ్రెస్ కు తెలియకుండా జరిగిందని షర్మిల చెప్పుకొచ్చారు.
వైఎస్సార్టీపీ విలీనం కోసం షర్మిల సిద్దమకే సంకేతాలు ఇస్తూనే..తనను నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. షర్మిల వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి తుమ్మల ఈ రోజు సోనియా సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ కండువ కప్పుకోనున్నారు. తుమ్మల సైతం పాలేరు పైనే పట్టబుట్టినట్లు సమాచారం.
విలీనానికి రంగం సిద్దం: తాజాగా తుమ్మలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే సమావేశమయ్యారు. ఆ సమయంలో ఖమ్మం అసెంబ్లీ నుంచి తుమ్మల బరిలోకి దిగేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. దీని ద్వారా పరోక్షంగా షర్మిలకు పాలేరు సీటు ఖాయమైందని వైఎస్సార్టీపి వర్గాలు చెబుతున్నాయి. సోనియా హైదరాబాద్ రావటం..సీడబ్ల్యూసీ సమావేశం కానుండటంతో జాతీయ స్థాయిలో అందరి ఫోకస్ హైదరాబాద్ మీదే ఉంది.
తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటనకు ఇదే సరైన సమయంగా నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా డీకే శివకుమార్ తో భేటీ అయిన షర్మిల తుది చర్చలు చేసినట్లు తెలుస్తోంది. సోనియా, రాహుల్ సమక్షంలో ఈ రోజున షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
