స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ స్పందించారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ అటు చంద్రబాబు పైన ఇటు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు దోచుకున్నారని వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ జగన్ దోచుకున్నాడు అని చంద్రబాబు చెప్తున్నారని, మీ మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి? అంటూ కే ఏ పాల్ ప్రశ్నించారు. దోచుకున్న వాళ్లంతా దేశ నాయకులంట.. చాలా దారుణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.
బాయ్ బాయ్ మోడీ.. బాయ్ బాయ్ బాబు.. బాయ్ బాయ్ జగన్ అంటూ కే ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, అదానీల తొత్తులా మీరు అంటూ కేఏ పాల్ ఏపీ రాజకీయ నేతలను ప్రశ్నించారు. ఇక చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడిన ఆయన చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు కాబట్టే అరెస్టు అయ్యారని వ్యాఖ్యానించారు.
టిడిపి నాయకులు బాబు రావాలని అంటున్నారని… అసలు బాబు ఎందుకు రావాలో చెప్పాలని ప్రశ్నించారు కేఏ పాల్. అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురాలేక పోయారని, రాష్ట్రానికి కియా తప్ప మరే కంపెనీని తీసుకు రాలేకపోయారని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ కోసం ఎవరైనా ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారా చెప్పాలని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్.
రాష్ట్రంలో కుటుంబ పాలనను ఆపుదామని అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అంబేద్కర్, మహాత్మా గాంధీ అంట.. లోకేష్ భగత్ సింగ్ అంటా అంటూ కేఏ పాల్ ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ తనతో కలిసి రావాలని కే ఏ పాల్ పిలుపునిచ్చారు. తాను పోరాటం చేస్తే అన్నీ భూ స్థాపితం అయిపోతాయని పేర్కొన్న కేఏ పాల్ తాను 42 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు.
