విశాఖపట్నం: బంగాళాఖాతంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. క్రమంగా అల్పపీడనంగా మారడానికి అనువైన వాతావరణం ఉంది. తదనంతరం ఇది ఒడిశా, ఉత్తరాంధ్ర, ఛత్తీస్గఢ్, ఉత్తర తెలంగాణ మీదుగా విస్తరించవచ్చని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఫలితంగా ఈ నెల 17వ తేదీ వరకూ ఈ నాలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
బంగాళాఖాతం మధ్య- ఉత్తర రీజియన్ల గగనతలంపై ఏడున్నర కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఈ ఆవర్తనం వచ్చే 24 గంటల వ్యవధిలో అల్పపీడనంగా మారుతుందని ది వెదర్ ఛానల్ కూడా నిర్ధారించింది. అల్పపీడనంగా మారిన అనంతరం క్రమంగా ఒడిశా దక్షిణ ప్రాంతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా విస్తరిస్తుందని పేర్కొంది.
దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం నుంచి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు, 16-17 తేదీల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వరకు వర్షాలు పడొచ్చని వెదర్ ఛానల్ వివరించింది. అరేబియా సముద్రం మీదుగా తేమతో కూడిన పశ్చిమ గాలుల ప్రభావంతో ముంబైతో సహా కొంకణ్ తీరంలో వచ్చే అయిదు రోజుల పాటు అడపా దడపా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఏపీలో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని ది వెదర్ ఛానల్ అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు.
