ఎన్నికల వేళ కీలక నిర్ణయాల దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. విదేశీ పర్యటన ముగియగానే కీలక నిర్ణయాల ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది. ఇక ఎన్నికల కార్యాచరణ ప్రారంభించేందుకు సీఎం సిద్దం అవుతున్నారు.
అసెంబ్లీ సమావేశాలతో పాటుగా ఎమ్మెల్యేల పని తీరు ఆధారంగా వారికి సీట్లు..అవసమైన చోట్ల మార్పులు తప్పవని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రజలతో మమేకం అయ్యేలా కొత్త కార్యక్రమం ప్రకటించనున్నారు.
కీలక నిర్ణయాల దిశగా:ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలకు సిద్దమవుతన్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ నెల 11న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 15న మంత్రివర్గ సమావేశం..ఈ నెల 20వ తేదీ నుంచి అసెంబ్లీ నిర్వహణకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో పార్టీ బాధ్యులు..
ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ నిర్వహణకు నిర్ణయించారు. ఇప్పటి వరకు నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం నిర్వహణ పైన పలు దఫాలు సీఎం జగన్ సమీక్షలు నిర్వహించారు. ప్రజలతో మమేకం అయిన ఎమ్మెల్యేల పని తీరు గురించి నివేదికలను విశ్లేషించారు. వెనుకబడిన వారికి పని తీరు మెరుగుపర్చుకొనేందుకు సమయం ఇచ్చారు. ఎమ్మెల్యే ల గ్రాఫ్ పెరగకుంటే మార్పు తప్పదని స్పష్టం చేసారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది.
ఎమ్మెల్యేలకు ఫైనల్ అలర్ట్:ముఖ్యమంత్రి ఈ నెలాఖరులో నిర్వహించే వర్క్ షాప్ లో ఎమ్మెల్యేల పని తీరు పై తుది నివేదికను వెల్లడించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నివేదికల్లో ఇప్పటి వరకు పని తీరు మెరుగ్గా ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ఎటువంటి మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది.
పని తీరు, పార్టీ వ్యవహారాలు, ప్రజలతో మమేకం వంటి అంశాల్లో గ్రాఫ్ సరిగ్గా లేని వారి స్థానాల్లో మాత్రం కొత్త సమన్వయకర్తలను నియమించక తప్పదని స్పష్టం చేసేందుకు సిద్దం అవుతున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. తప్పించే వారిని పార్టీ సేవలకు వినియోగించుకోవటం..అధికారంలోకి వచ్చిన తరువాత వారికి ప్రాధాన్యత కొనసాగిస్తారని చెబుతున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉందనే దాని పైన ఇప్పటికే సీఎం వద్దకు నివేదికలు చేరాయి.
గెలుపే ప్రామాణికంగా:ఇక, ఈ నిర్ణయాలతో పాటుగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ముగించే అవకాశం ఉందని సమాచారం. ఆ స్థానంలో జగనన్న సురక్ష, వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన కార్యక్రమం ప్రతీ ఇంటికి తీసుకెళ్లే విధంగా షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఈ పథకాలు ఎన్నికల ప్రచారం వరకు కొనసాగించాలని భావిస్తున్నారు.
ప్రతీ ఇంటికి అందిన సంక్షేమం గురించి వివరిస్తూనే..ఈ పథకాలు కొనసాగింపుతో పాటుగా రాష్ట్రానికి జగన్ అవసరం వివరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇదే సమయంలో అవసరమైన నియోజవకర్గాల్లో సమన్వయకర్తలను నియమిస్తూ..డిసెంబర్ చివరి నాటికి తుది నివేదికల ఆధారంగా అభ్యర్దుల ను ఖరారు చేస్తారని సమాచారం. దీంతో, జగన్ కు అందిన నివేదికలు..నిర్ణయాలపైన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
