హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో పలువురు కీలక నేతల చేరికలు మరింత ఊపునిచ్చేలా ఉన్నాయి. ఇందుకు సెప్టెంబర్ 17న నిర్వహించనున్న బహిరంగ వేదిక కానున్నట్లు తెలుస్తోంది.
భారీ ఎత్తున జనసీమకరణ చేసి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. ఇదే సభలో ఓ ఎమ్మెల్యే సహా మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.
ఇటీవల హైదరాబాద్లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్లు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. మైనంపల్లితో ఇప్పటికే చర్చించారు.
మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్కు మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ స్థానాలను కేటాయించడానికి కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలిసింది. మరోవైపు, మరో బీఆర్ఎస్ రెబల్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డి తోపాటు పలువురు నేతలు ఇటీవల తుమ్మల ఇంటికి వెళ్లి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తుమ్మలతో భేటీ అయ్యారు. ఇక కేసీ వేణుగోపాల్ కూడా ఈ విషయంపై మాట్లాడినట్లు తెలిసింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి తుమ్మల నాగేశ్వరరావు చేరిక దాదాపు ఖరారైంది. తుమ్మల.. పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పాలేరు, ఖమ్మం లేదా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలనే యోచనలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇది ఇలావుండగా, బీజేపీ నుంచి సస్పెండ్కు గురైన యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ నుంచి గతంలో బీజేపీ తరపున గెలుపొందిన శ్రీనివాస్ రెడ్డి సెప్టెంబర్ 17నే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో యెన్నం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే యెన్నంను బీజేపీ సస్పెండ్ చేసింది. దీంతో బీజేపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. యెన్నంను తీసుకోవాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీలో తర్జనలుభర్జనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన రాక ఎలాంటి ప్రభావం చూపుతుందని చర్చిస్తున్నారు.
