దేశ రాజధాని ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు సిద్దమైంది. జీ20 దేశాల అధినేతలు ఢిల్లీలో అడుగు పెడుతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రన్ వే 28పై దేశాధినేతల విమానాలు దిగనున్నాయి.
మొత్తం 70 ప్రత్యేక విమానాల్లో వివిధ దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలి వస్తున్నారు. దేశాధినేతలకు ఆహ్వానం పలికేందుకు ఎయిర్పోర్టులో మూడు సెరిమోనియల్ లాంజ్ల ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్షుడు ఈ సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు.
జీ20 సదస్సుకు సర్వం సిద్దం:జీ20 సదస్సుకు సర్వం సిద్దమైంది. తొలుత బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్, జపాన్ ప్రధాని కిషిదా, సాయంత్రానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ చేరుకుంటారు. ఆ వెంటనే ప్రధాని మోదీ తో సమావేశంలో పాల్గొననున్నారు. సదస్సుకు హాజరవుతున్న విదేశీ నేతల్లో ముందుగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్కు చేరుకోనున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 1.40గంటలకు ఆయన రానున్నారు. 2.15కు జపాన్ ప్రధాని కిషిదా ఢిల్లీలో దిగుతారు. కాగా, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినిబు మంగళవారమే రాగా.. మారిషస్ అధ్యక్షుడు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు గురువారం చేరుకున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సాయంత్రం 7గంటలకు, చైనా ప్రధాని లీ కియాంగ్ రాత్రి 7.45గంటలకు దిగుతారు.
తరలి వస్తున్న ప్రపంచాధినేతలు:అర్జెంటీనా, ఇటలీ, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జపాన్, సౌదీ అరేబియా, కొరియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, యూఏఈ, నెదర్లాండ్స్, బ్రెజిల్, ఇండోనేసియా, తుర్కియే, స్పెయిన్, సింగపూర్ దేశాధినేతలు, ఆఫ్రికన్ యూనియన్ ప్రతినిధులు శుక్రవారమే వస్తారు. జర్మనీ చాన్స్లర్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ శనివారం హాజరవుతారు. వీరికి విమానాశ్రయంలో కేంద్ర సహాయ మంత్రులు స్వాగతం పలుకుతారు. -20 సభ్యదేశాల్లో చైనా, రష్యా అధినేతలు మాత్రం ఈసారి సమావేశాలకు హాజరుకావడం లేదు. చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ స్థానంలో చైనీస్ ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన బదులుగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రిని పంపుతున్నారు.
బైడెన్కు పటిష్ఠ భద్రత:ప్రపంచాధినేతలంతా ఒక్క చోటే చేరితే ఇక భద్రత ఏ స్థాయిలో ఉండాలో ఊహించుకోవచ్చు. వీవీఐపీ జోన్ సెంట్రల్ ఢిల్లీతో పాటు యావత్ నగరం భద్రతావలయంలోకి వెళ్లిపోయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సాయంత్రం 6.55గంటలకు పాలెం విమానాశ్రయానికి రానున్నారు.
ఆయనకు కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ స్వాగతం పలుకుతారు. బైడెన్, అమెరికా ప్రతినిధి బృందం ఐటీసీ మౌర్య హోటల్లో బస చేయనుంది. అమెరికా అధ్యక్షుడితో సదస్సు సందర్భంగా.. శుద్ధ ఇంధనం, వాతావరణ మార్పులపై భారత ప్రధాని మోదీ చర్చించనున్నారు. బైడెన్ గురువారమే భారత్ బయల్దేరారు. ఆయనకు ఢిల్లీలో మూడంచెలతో కూడిన భద్రత కల్పించనున్నారు. అమెరికా అధ్యక్షుడి వాహనమైన కాడిలాక్ కారు ‘బీస్ట్’ను బోయింగ్ సి-17 గ్లోబ్ మాస్టర్3లో తీసుకురానున్నారు.
