తిరుమల నడకమార్గంలో శాశ్వత భద్రతా చర్యల పైన టీటీడీ ఫోకస్

తిరుమల నడకమార్గంలో శాశ్వత భద్రతా చర్యల పైన టీటీడీ ఫోకస్ చేసింది. చిన్నారి లక్షిత చిరుత దాడిలో బలి కావటంతో వెంటనే చర్యలు ప్రారంభించింది.

భక్తులకు రక్షణ కోసం నడక మార్గంలో ఇప్పటికే అనేక ఆంక్షలు అమలు చేస్తున్న టీటీడీ..ఆపరేషన్ చిరుత కొనసాగిస్తోంది. అందులో భాగంగా..ఇప్పటి వరకు అయిదు చిరుతలను బంధించారు. ఆపరేషన్ కొనసాగుతుందని ప్రకటించారు. ఇదే సమయంలో కేంద్రానికి కీలక ప్రతిపాదన పంపింది.

నడక మార్గంలో కంచె దిశగా:అలిపిరి నడకమార్గంలో వరుసగా చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించారు. ఇంకా వీటి సంచారం ఉందని గుర్తించటంతో మరింత అప్రమత్తమైన టీటీడీ చర్యలు ప్రారంభించారు. గతంలో నడక మార్గంలో నిత్యం 12-15 వేల మంది వరకు భక్తులు తిరుమల చేరుకొనే వారు. లక్షిత ఘటన తరువాత నడక మార్గంలో భక్తుల సంఖ్య తగ్గేలా చర్యలు తీసుకున్నారు. దివ్యదర్శనం నడకమార్గంతో పాటుగా రోడ్డు మార్గంలో చేరుకున్నా అందేలా వెసులుబాటు కల్పించారు. దీంతో, మొక్కులు ఉన్న వారు మినహా తక్కువ సంఖ్యలో నడకమార్గంలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఇదే సమయంలో భక్తుల రక్షణ కోసం పలు నిర్ణయాలు టీటీడీ అమలు చేస్తోంది.

టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు:నడక మార్గంలో వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచిస్తోంది. వారి భద్రత కోసం సిబ్బందితో పాటుగా ..రక్షణ చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో భక్తులకు చేతి కర్రలు ఇచ్చి పంపుతున్నారు. ఇక, శాశ్వత రక్షణ చర్యల పైన ఫోకస్ చేసింది.

అందులో భాగంగా నడకమార్గాల్లో ఇరుపకంచె నిర్మాణాల కోసం ప్రతిపాదనను కేంద్రానికి పంపిందని సమాచారం. 7.2 కిలోమీటర్ల దూరం 3550 మెట్లు ఉన్న అలిపిరి నడక మార్గం, మరోవైపు 2.1 కిలో మీటర్ దూరంలో 2650 మెట్లు ఉన్న శ్రీవారి మెట్టుమార్గం ఇరువైపులా ఇనుప కంచె నిర్మాణం చేపట్టాలని కొంత కాలంగా టీటీడీకి సూచనలు వస్తున్నాయి. అయితే, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపారని తెలుస్తోంది.

కంచెకు అనుమతి దక్కేనా:ప్రస్తుతం నడక మార్గంలో భద్రతా చర్యల్లో భాగంగా..రెండు నడకమార్గాల్లో 500 ట్రాప్ కెమెరాలతో చిరుతలు క్రూర మృగాలు కదలికలపై మానిటరింగ్ చేస్తున్నారు. నడక మార్గాల్లో రెండు వైపులా కంచె నిర్మాణం పైన ప్రతిపాదనలు వచ్చినా..అటవీ శాఖ చట్టాలకు విరుద్దమంటూ వాదనలు వినిపించాయి.

ఇప్పుడు లక్షలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావటంతో టీటీడీ ఇందుకు అనుమతి కోరుతూ మరోసారి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.డిజైన్లతో అంగీకారం తెలిపితే నడకమార్గాల్లో ఇరువైపులా కంచి నిర్మాణం చేపట్టేందుకు టీటీడీ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. దీంతో, ఇప్పుడు ఇందుకు అనుగుణంగా అనుమతి వస్తుందా రాదా అనేది తేలాల్సి ఉంది.

Posted Under AP
Editor