ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ నాయకత్వం గురి పెట్టింది. హైదరాబాద్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

తెలంగాణతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం అడుగులు వేస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. తాజాగా, హైదరాబాద్ కేంద్రంగా రాహుల్ గాంధీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వస నీయ సమాచారం.

కాంగ్రెస్ మిషన్ 2024

తెలంగాణతో పాటుగా మిషన్ 2024 ఆపరేషన్ కాంగ్రెస్ ప్రారంభించింది. అందుకు హైదరాబాద్ వేదికగా నిలవనుంది. ఈ నెల 16, 17 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనాయకత్వం హైదరాబాద్ లో మకాం వేయనుంది. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ మండలి సీడబ్ల్యూసీ సమావేశం హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. 17న భారీ బహిరంగ సభలో సోనియాతో పాటుగా కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. పార్టీ ఎన్నికల గ్యారంటీ పథకాలను సోనియా ఆవిష్కరించనున్నారు. ఇదే సమయంలో కర్ణాటక, తెలంగాణ తో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో తమకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కాంగ్రెస్ నిర్దారణకు వచ్చింది. దీంతో, రాహుల్ గాంధీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ కేంద్రంగా

దక్షిణాది రాష్ట్రాల కోసం హైదరాబాద్ లో రాహుల్ తన నివాసం ఏర్పాటుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఇక్కడికి షిఫ్ట్ అవుతారనే ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలు నిర్వహించే ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్లు సమాచారం. రాహుల్‌తో పాటు తల్లి సోనియాగాంధీ కూడా కొంతకాలం హైదరాబాద్‌లో ఉండేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు ఉన్న ఇంటిని అన్వేషించే పనిలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తెలంగాణకు చెందిన ఒక ముఖ్య నేతతో కాంగ్రెస్ హైకమాండ్ లో కీలక నేత ఈ మేరకు చర్చలు చేసినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి వచ్చే వారం హైదరాబాద్ పర్యటనలో స్పష్టత రానుంది.

రాహుల్ కేరాఫ్ హైదరాబాద్

తెలంగాణ ఎన్నికల సమయంలోనే షిఫ్ట్ అవ్వటం ద్వారా రాజకీయంగా కలిసి వస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, భద్రతా పరంగానూ ఆమోదం అవసరం. దీంతో..ఇప్పటికే సిద్దంగా ఉన్న ఇంటిని ఎంచుకుంటారా..లేక, కొత్త నిర్మాణం చేస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. నగరంలోని బోయినపల్లిలో రాజీవ్గాంధీ ఐడియాలజీ సెంటర్‌కు భూమిపూజ చేస్తారు. అక్కడున్న ఎనిమిది ఎకరాల స్థలంలో మోడర్న్ గెస్ట్ హౌస్ నిర్మించే ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. దీని పైన అధికారికంగా నిర్ణయం తీసుకుంటే, భద్రతా పరంగా చర్చల తరువాత ఇంటిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు. ఇది, ఖచ్చితంగా పార్టీకి కలిసి వచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. మరి..దీని పైన తుది నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.

Editor