175 స్థానాల్లోనూ పార్టీ జెండా ఎగరాలనే పట్టుదల

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం.

ప్రత్యర్థి పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదని, 175 స్థానాల్లోనూ పార్టీ జెండా ఎగరాలనే పట్టుదలతో ఉన్నారు. దీనికోసం వైనాట్ 175 కాన్సెప్ట్‌ను ప్రవేశ పెట్టారు.

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. ఈ విషయంలో రాజీపడట్లేదు. సరిగ్గా పనిచేయని, జనంలో లేని ఎమ్మెల్యేలకు టికెట్ల దక్కబోవంటూ ఇదివరకే హెచ్చరించారు కూడా. దీని కోసం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొలమానంగా తీసుకుంటోన్నారు.

ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్‌బ్యాక్‌ను వైఎస్ జగన్ ప్రాతిపదికగా తీసుకుంటోన్నారు. దీని ఆధారంగానే టికెట్లను కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే- నాలుగైదు సార్లు ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.

వైనాట్ 175 టాస్క్‌ను కంప్లీట్ చేయాలంటే వైఎస్ఆర్సీపీకి అన్ని స్థానాలను ఖచ్చితంగా గెలుచుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న కుప్పం, హిందూపురం వంటి నియోజకవర్గాల్లోనూ పాగా వేయాల్సి ఉంటుంది. చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాలు అవి.

టీడీపీకి కంచుకోటలుగా భావించే నియోజకవర్గాల్లో విశాఖపట్నం తూర్పు ఒకటి. ఇక్కడి నుంచి వెలగపూడి రామకృష్ణబాబు హ్యాట్రిక్ కొట్టారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ, 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మట్టికరిపించారు. భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.

ఈ నియోజకవర్గంపై వైఎస్ఆర్సీపీ దృష్టి సారించింది. వెలగపూడిపై అభ్యర్థిని సిద్ధం చేసింది. విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణను బరిలోకి దించింది. ఆయనను విశాఖ తూర్పు ఇన్‌ఛార్జీగా నియమిస్తూ కొద్దిసేపటి కిందటే ఆదేశాలను జారీ చేసింది వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం.

దీన్ని బట్టి చూస్తే- ఇక వచ్చే ఎన్నికల్లో ఎంవీవీ సత్యనారాయణకు విశాఖపట్నం లోక్‌సభ టికెట్ లేనట్టే. ఆయనను విశాఖ తూర్పు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలిపినట్టయింది. ఎంవీవీ స్థానంలో ఓ వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఎంపీగా పోటీ చేయించడం ఖాయమైంది.

Posted Under AP
YES9 TV