అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. తాత్కాలిక విరామాన్ని ప్రకటించనున్నారు. మొన్నటివరకు వారాహి విజయ యాత్రతో తీరిక లేకుండా గడిపిన ఆయన కొద్దిరోజుల పాటు పొలిటికల్ టూర్లు, రాజకీయ కార్యకలాపాలకు పుల్ స్టాప్ పెట్టనున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు పవన్ కల్యాణ్. ఆయన నటిస్తోన్న సినిమాల్లో ఒకటి ఓజీ. హైఓల్టేజ్ యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్పై ఉంది. కొద్ది రోజుల కిందటే ముంబైలో షూటింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి యూనిట్ వరుసగా నాలుగు షెడ్యూళ్లను పూర్తి చేసింది. సుమారు 60 శాతం మేర టాకీ పార్ట్ కూడా కంప్లీట్ అయింది.
రన్ రాజా రన్, సాహో చిత్రాలను తీసిన సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ మూవీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ సినిమాను. తమిళనటి ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి కీలక పాత్రలో నటిస్తోన్నారు.
ప్రకాష్ రాజ్, తమిళ నటులు అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్.. సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తోన్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలనేది చిత్రం యూనిట్ ప్లాన్. అందుకే ఈ మూవీ షూటింగ్ను వేగంగా పూర్తి చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో- అక్టోబర్లో 20 రోజులు, నవంబర్లో ఎనిమిది రోజుల పాటు పవన్ కల్యాణ్ ఈ సినిమాను పూర్తి చేయడానికి డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ 20 రోజుల షూటింగ్ మొత్తం బ్యాంకాక్లో ఉంటుందని టాక్. ప్రస్తుతం బ్యాంకాక్లో షూటింగ్ స్పాట్లను ఎంపిక చేసుకుంటోంది యూనిట్. అక్టోబర్ నాటికి అది ఫైనల్ అవుతుందని, ఆ వెంటనే పవన్ బ్యాంకాక్ వెళ్తారని చెబుతున్నారు.
దీనితో అక్టోబర్, నవంబర్ నెలల్లో పవన్ కల్యాణ్ రాజకీయ కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని సమాచారం. నవంబర్ రెండు లేదా మూడో వారం నుంచి ఆయన మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటారని, వారాహి మూడో విడత యాత్రను నిర్వహించేలా ప్లాన్ చేస్తారని చెబుతున్నారు.
