ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి జగన్ తిరిగి అధికారం దక్కించుకోవటం పై ధీమాగా ఉన్నారు. ప్రతిపక్షాలు సీఎం జగన్ లక్ష్యంగా ఒక్కటవుతున్నాయి.
టీడీపీ..జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ తీరు పైన అస్పష్టత కొనసాగుతోంది. కేంద్రంలో సమీకరణాలు మారుతున్నాయి. కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమైంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ప్రధానితో పాటుగా అమిత్ షా తోనూ సీఎం భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రధానితో సీఎం జగన్ భేటీ: ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 5,6 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీలో ఉండనున్నారు. రాష్ట్రంలో..కేంద్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. 2019 ఎన్నికల సమయం నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో అవసరమైన సందర్భాల్లో అంశాల వారీగా వైసీపీ ఎంపీలు కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో నడ్డా, అమిత్ షాతో భేటీతో ఒక్క సారిగా రాజకీయంగా అనేక చర్చలు మొదలయ్యాయి. ఆ తరువాత రాష్ట్రానికి వచ్చిన నడ్డా, అమిత్ షా వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేసారు. దీంతో, సీఎం జగన్ తమకు బీజేపీ లాంటి పార్టీల మద్దతు ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.
పాలన..రాజకీయ అంశాలపై చర్చ: ఇప్పుడు కేంద్రంలో రాజకీయ లెక్కల్లో మార్పు కనిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో ఈ సారి కేంద్ర ప్రవేశ పెట్టాలని భావిస్తున్న కామన్ సివిల్ కోడ్ బిల్లుకు రాజ్యసభలో మద్దతు అవసరం. ఈ బిల్లు విషయంలో ఇప్పటికే వైసీపీ తమ మద్దతు స్పష్టం చేసింది. ఇదే సమయంలో ప్రధాని మోదీ పార్టీ..ప్రభుత్వ పరంగా ప్రక్షాళన ప్రారంభించారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ఈ సమయం లోనే ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో భేటీ కానున్నారు. పోలవరం అడహక్ నిధులకు కేంద్ర ఆర్దిక శాఖ ఆమోదం తెలిపినా నిధుల విడుదల కాలేదు. దీంతో పాటుగా పెండింగ్ అంశాలైన ప్రధానితో చర్చించనున్నారు. రాజకీయంగానూ వీరిద్దరి మధ్య చర్చలతో పాటుగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీలో బీజేపీ వైఖరి పైన ఈ పర్యటనలో క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు.
