నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడి నిధులకు ముహూర్తం ఖరారు చేసారు. సీఎం జగన్ ఈ నెల 28న కురుపాం లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే సభలో పాల్గొని ఈ ఏడాది అమ్మ ఒడి నిధులు విడుదల చేయనున్నారు.
దాదాపు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ 15 వేలు చొప్పున నిధులు జమ కానున్నాయి. అర్హుల జాబితాను ప్రకటించారు. ఇప్పటికే మూడు సార్లు ఈ నిధులను విడుదల చేసిన సీఎం..నాలుగో విడత ఇచ్చేందుకు సిద్దమయ్యారు.
ముఖ్యమంత్రి జగన్ మానసపుత్రిక అమ్మఒడి నిధులు ఈ నెల 28న విడుదల చేయనున్నారు. నవరత్నాల అమల్లో భాగంగా ప్రతీ ఏటా విద్యా అమ్మఒడి నిధులను సీఎం జగన్ విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఈ రోజు లబ్ధిదారుల జాబితా సిద్దం చేసారు. విద్యార్ధులకు 75 శాతం హాజరుతో పాటుగా ప్రభుత్వం నిర్దేశించిన నిబందనలకు అనుగుణంగా ఎంపికైన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమకానున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాం నియోకవర్గంలో సీఎం జగన్ జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. నిధుల విడుదలతో పాటుగా బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అమ్మఒడి అర్హుల జాబితాను ఆన్ లైన్ లో ఉంచటంతో పాటుగా స్థానిక సచివాలయాల్లోనూ లబ్దిదారుల జాబితా అందుబాటులో ఉంచారు. అమ్మఒడి పథకం కింద మూడేళ్ల కాలంలో ఏపీ ప్రభుత్వం రూ.19,617 కోట్లు అందించింది. గత ఏడాది ఒకటి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్ల రుపాయలను ముఖ్యమంత్రి బ్యాంకు ఖాతాలకు జమ చేసారు. ఈ సారి అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అమ్మఒడి పథకంలో తొలి ఏడాది తల్లులకు రూ.15 వేలు జమ చేసారు. గత ఏడాది నుంచి అమ్మఒడి కింద ఇచ్చే రూ 15 వేల నుంచి పాఠశాల..టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ 2వేలు మినహాయిస్తోంది.
