బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ మంచి దూకుడు మీద ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈసారి ఎలాగైనా ఎన్నికలలో విజయం సాధించాలని, మూడోసారి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని కృతనిశ్చయంతో ఉన్న కెసిఆర్ అందుకు తగ్గట్టుగా ముందస్తు వ్యూహాలతో ఎన్నికలకు రెడీ అవుతున్నారు.
ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సర్వే చేయించిన కేసీఆర్, వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అయిపోగానే మొదటి జాబితాగా 70 మందికి టికెట్లు ప్రకటించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారని పార్టీ శ్రేణులలో జోరుగా చర్చ జరుగుతుంది.
ఆరు నెలలకు ముందే టికెట్లు ప్రకటిస్తానని కేసీఆర్ గతంలో చెప్పిన నేపథ్యంలో ఆ మాట ప్రకారం కెసిఆర్ మొదటి జాబితాలో 70 మందికి టిక్కెట్లను ప్రకటించబోతున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఉత్కంఠ నెలకొంది. ఏయే నియోజకవర్గాలకు కేసీఆర్ టికెట్స్ ప్రకటిస్తారు? తమకు టికెట్ వస్తుందా లేదా? అన్న ఆందోళనలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
