Latest Posts

వరంగల్ నుంచి బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ ద్వారా సమర శంఖాన్ని పూరించారు

వరంగల్ నుంచి బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ ద్వారా సమర శంఖాన్ని పూరించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పై తమ యుద్ధాన్ని ప్రకటించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నందుకు తనను పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధ కాండకు తెరతీసారని, అందుకే ఓరుగల్లు గడ్డపైనే నిరుద్యోగ మార్చ్ ప్రారంభించి కెసిఆర్ ను హెచ్చరిస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు నాశనమయ్యాయని, అయినా కెసిఆర్ స్పందించలేదని బండి సంజయ్ మండిపడ్డారు. విచారణ జరిపించాలని కోరినందుకు తనను ఓరుగల్లు గడ్డపైన అరెస్టు చేశారని గుర్తు చేసిన బండి సంజయ్, ఇదే ఓరుగల్లు గడ్డపై వేలాది మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహించామని, బిజెపి సత్తా చాటామని పేర్కొన్నారు. తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు జరిపించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

తప్పు చేశాడు కాబట్టే కొడుకును కాపాడుకోవాలనుకుంటున్నాడని కెసిఆర్ పై మండిపడ్డారు. తప్పు చేస్తే కేసీఆర్ కుటుంబానికి ఒక న్యాయం.. సామాన్యులకు ఒక న్యాయమా? అంటూ ప్రశ్నించారు. లిక్కర్ దందా నుండి తప్పించుకోవడానికి రాజ్యశ్యామలయాగం చేస్తూ కాలు విరిగిందని ఈడీకి కుంటసాకులు చెబుతున్న కేసీఆర్ బిడ్డ అంటూ కవితను టార్గెట్ చేశారు. మీరు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతుంటే, తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం బిజెపి కాదని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఉద్యోగాలు రాక ఎంతో మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడినా కెసిఆర్ ఏనాడూ మాట్లాడలేదని, ఆర్టీసీ కార్మికులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినా ఇప్పటివరకు కేసీఆర్ స్పందించింది లేదని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా కెసిఆర్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ప్రకటించి, నేటికీ కూడా భర్తీ చేయని దుర్మార్గపు సర్కార్ కేసీఆర్ దని మండిపడ్డారు.

తక్షణమే సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ట్విట్టర్ టిల్లు రాజీనామా చేయాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాలన్నారు. అందుకోసమే నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్న బండి సంజయ్ ఈ నిరుద్యోగ మార్చ్ ఇంతటితో ఆగదన్నారు. ఈనెల 21వ తేదీన పాలమూరు గడ్డమీద నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామన్నారు.

కేసీఆర్.. బీజేపీ కళ్ళు తెరిస్తే మాడి మసైపోతావ్: ఈటల రాజేందర్ ఫైర్

ఆ తర్వాత అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చి నిర్వహించి, ఆపై లక్షలాది మందితో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసే ఫైలుపై మొట్టమొదటి రోజే సంతకం చేస్తామన్నారు. ఎవరు సీఎం అయినా సరే కచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయిస్తామని బండి సంజయ్ వెల్లడించారు.కేసీఆర్ నరహంతక పాలనను తరిమితరిమి కొడదామని, గడీల పాలనలో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేసే బాధ్యత 30 లక్షల నిరుద్యోగుల కుటుంబాలపై ఉందన్నారు బండి సంజయ్

YES9 TV