కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, డీఎల్ రవీంద్రా రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఘాటు విమర్శలు సంధించారు.
కోడికత్తి కేసులో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియలో వస్తోన్న కథనాలను తప్పుపట్టారు. ఈ ఘటనపై ఎన్ఐఏ సమగ్ర విచారణ జరుపుతోందని, దీన్ని పక్కదారి పట్టించేలా కథనాలు వస్తోన్నాయని అన్నారు.
గతంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్లో చోటు చేసుకున్న హత్యాయత్న ఘటనపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎల్ రవీంద్రారెడ్డి అవుట్ డేటెడ్ పోలిటిషీయన్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని కురసాల కన్నబాబు హెచ్చరించారు.
డీఎల్ రవీంద్రా రెడ్డికి తెలుగుదేశం పార్టీ నుంచి స్క్రిప్ట్ అందిందని, దాని ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ స్క్రిప్ట్తో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం డీఎల్ రవీంద్ర రెడ్డి వంటి సీనియర్ నేతకు తగదని చెప్పారు. ఇదే భాషను తాము ఎప్పుడైనా ప్రయోగించామా? అంటూ కురసాల నిలదీశారు. డీఎల్ ఒక్కడే కాదు.. నారా లోకేష్, వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు వంటి నాయకులు ఒకేరకమైన స్క్రిప్టును చదువుతున్నారని ఎద్దేవా చేశారు.
TSPSC పరీక్షల కొత్త తేదీలొచ్చేశాయ్
ఒక గృహిణిగా, పారిశ్రామికవేత్తగా విజయవంతమైన వైఎస్ భారతి వంటి మహిళ గురించి మాట్లాడేవారికి కొంచెమైన జ్ఞానం ఉండాలని హితవు పలికారు. రాజకీయాల గురించి పట్టించుకోని మహిళపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తెలుగుదేశం పార్టీ నాయకుల కుసంస్కారానికి అద్దం పడుతోందని అన్నారు. టీడీపీ నాయకులు ఏనాడు కూడా మహిళలకు గౌరవం ఇచ్చిన పాపానపోలేదని మండిపడ్డారు. ఇవే మాటలు మీ ఇళ్లలోని మహిళల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
కోడికత్తి ఉదంతంలో కుట్ర కోణం ఉందని తాము చెబుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని కురసాల కన్నబాబు ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో ఈ కేసు విచారణలో ఉండగానే.. ఎల్లో మీడియా తీర్పులు ఇస్తోండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కోడికత్తి కేసు ఘటనలో తమ ప్రమేయం లేకపోయి ఉంటే టీడీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.
