Latest Posts

ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు.. వాహ్ కేసీఆర్‌ వాహ్!

రాష్ట్ర విభజనతో ఆంధ్రా ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిన తెలంగాణ సిఎం కేసీఆర్‌, బిఆర్ఎస్‌ పార్టీతో మళ్ళీ ఆంద్రాలో అడుగుపెట్టాల్సివస్తుందని ఊహించి ఉండరు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి వేలుపెట్టి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కాకుండా నిలిచిపోయేలా చేయడంతో ఆంధ్రా ప్రజలు కేసీఆర్‌ మీద ఆగ్రహంగా ఉన్నారు.

అయితే ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మలుచుకొనే చక్కటి అవకాశం ఎదురుగా కనిపిస్తుంటే, ఏపీలో ఎలా అడుగుపెట్టాలా. అని చూస్తున్న కేసీఆర్‌కి ఆయన కత్తులు దూస్తున్న మోడీ ప్రభుత్వమే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ రూపంలో చక్కటి అవకాశం కల్పించడం విశేషం.

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు సరఫరా, నిర్వహణలో భాగస్వామ్యం, ప్లాంటులో ఉత్పత్తి అయిన ఉక్కును కొనుగోలుచేయడం కోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ)ను ఆహ్వానించింది. “ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరణలో తొలి అడుగు” అని నిరసన తెలియజేస్తూ తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ వారం రోజుల క్రితమే కేంద్రానికి ఓ పెద్ద లేఖ కూడా వ్రాశారు. కానీ తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఇప్పుడు ‘యూ టర్న్’ తీసుకొని ఈ ఈవోఐనే బిఆర్ఎస్‌ పార్టీ ఏపీలో అడుగుపెట్టడానికి ఓ గొప్ప రాజకీయ అవకాశంగా గుర్తించడం విశేషం.

1. తెలంగాణకు చెందిన సింగరేణి సంస్థ లేదా తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చేత గానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టించి దానిలో భాగస్వామిగా చేసిన్నట్లయితే, దానిని ప్రైవేట్ పరంకాకుండా కాపాడామని ఆంధ్రా ప్రజలకు చెప్పుకొని ఏపీలో అడుగుపెట్టవచ్చు. ప్రజలని ధైర్యంగా ఓట్లు అడగవచ్చు.

2. సింగరేణిలో కావలసినంత బొగ్గు గనులున్నాయి కనుక అక్కడి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేసి సింగరేణికి కూడా భారీగా ఆదాయం సమకూర్చవచ్చు.

3. తెలంగాణ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జిలు, భారీ భవనాలు నిర్మించబడుతున్నాయి. కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో తెలంగాణ సంస్థ భాగస్వామిగా ఉన్నట్లయితే వీటన్నిటికీ అవసరమైన స్టీల్ సరసమైన ధరలో పొందవచ్చు.

4. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ఆదానీ గ్రూప్ సొంతం చేసుకొనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కనుక ఈవిదంగా ఆదానీని కూడా ఢీకొని మోడీ-ఆదానీల బారి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడనని సగర్వంగా చెప్పుకొనే అవకాశం కూడా కేసీఆర్‌కు లభిస్తుంది.

ఈవోఐ ప్రక్రియకు ఈ నెల 15వ తేదీ గడువు కనుక నేడో రేపో తెలంగాణ ప్రభుత్వం తరపున వైజాగ్ రానున్నారు. వారు దీనిలో పాల్గొని వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ భాగస్వామిగా చేరేందుకు గల అవకాశాలను పరిశీలిస్తారు. ఆంద్రాలో అడుగుపెట్టడానికి కేసీఆర్‌కు ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకేముంటుంది? అంటే ఒకే దెబ్బకు రెండు కాదు నాలుగు పిట్టలు కూతబోతున్నారన్నమాట! వాహ్ కేసీఆర్‌ వాహ్!

చివరిగా ఒక ప్రశ్న: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టి ప్లాంట్‌ని, దానిలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులను కాపాడుకోవచ్చు కదా?

YES9 TV