హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ రహస్య భేటీ..? టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సంచలన ఆరోపణలు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను రహస్యంగా కలిశారు. హైదరాబాద్‌ శివారు ఓ ఫాంహౌజ్‌లో వారిద్దరూ మీట్ అయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సంచలన ఆరోపణలు చేశారు.

ఇదేమీ మామూలు కామెంట్ కాదు. స్టేట్ పాలిటిక్స్‌ను షేక్ చేసే లీక్. చేసింది అధికార పార్టీ అధ్యక్షుడు కాబట్టి.. ఆయన మాటలను లైట్ తీసుకోలేం. ఏదో వేక్‌గా అనేశారని భావించలేం. పక్కా సోర్స్ ఉండే ఉంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చే ఉంటుంది. అందుకే, అంత ధీమాగా, పబ్లిక్‌గా ఆ కామెంట్ చేసుంటారు మహేశ్‌కుమార్ గౌడ్. అదే నిజమైతే తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ అమాంతం మారిపోతాయి.

జూన్‌లో వరుసగా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది కేసీఆర్, హరీశ్, ఈటల రాజేందర్‌లు. ప్రస్తుతానికైతే కేసీఆర్, హరీశ్‌రావులు ఒకేమాట మీదున్నారు. ఫాంహౌజ్‌లో వరుసబెట్టి చర్చలు జరుపుతున్నారు. మరి, ఆనాటి ఆర్థిక మంత్రి ఈటల కమిషన్ ముందు ఏం చెబుతారనేది కూడా అత్యంత కీలకం. ఈటలకు ఆనాటి ప్రాజెక్టు లెక్కలన్నీ బానే తెలిసిఉంటాయి. నిధులు మంజూరు చేసింది ఆయనే కాబట్టి.. ఇంటర్నల్‌గా అసలేం జరిగిందో గుర్తు ఉండే ఉంటుంది. రాజేందర్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. కేసీఆర్‌తో బద్ధ శత్రుత్వం కూడా ఉంది. ప్రస్తుత పరిణామం ఈటలకు గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు. దెబ్బ కొడితే.. కేసీఆర్ నేరుగా జైలుకే అని చెబుతున్నారు. అందుకే, కాలేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ ఇచ్చే స్టేట్‌మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే కేసీఆర్‌ను కలవర పెడుతోందట.

ఈటలను కారు పార్టీ నుంచి అవమానకరంగా గెంటేశారు గులాబీ బాస్. కేసులు కూడా పెట్టారు. రాజేందర్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. అనుకోకుండా వచ్చిన ఈ ఛాన్స్‌ను వాడేసుకుని.. తనను ఇరికిస్తే..? ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన కేసీఆర్.. అల్లుడు హరీశ్‌రావును మధ్యవర్తిగా పంపించారని టీపీసీసీ చీఫ్ చెబుతున్నారు. కేసీఆర్ సూచనతోనే హరీశ్.. ఈటలను కలిశారని అన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు తాము ఏం చెప్పదలుచుకున్నామో రాజేందర్‌కు బ్రీఫింగ్ ఇచ్చినట్టున్నారు. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం.. ముందైతే ఈ గండం నుంచి గట్టెక్కించండంటూ ఈటల దగ్గరకు హరీశ్‌ను రాయబారిగా కేసీఆర్ పంపించారని ప్రచారం జరుగుతోంది. మరి, గులాబీ బాస్ బుజ్జగింపులకు ఈటల లొంగుతారా? పాత పగలు మరిచి కాంప్రమైజ్ అవుతారా? కేసీఆర్‌ను గట్టెక్కిస్తారా? కాళేశ్వరం గుట్టంతా బయటపెడతారా?

ఒకవేళ ఈటల రాజేందర్ కేసీఆర్‌కు అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇస్తే అది ఆయనకు, ఆయన పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితే అవుతుంది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారంటు కవిత సైతం కన్ఫామ్ చేసేశారు. ఇప్పుడు ఈటల పాజిటివ్‌గా ఉంటే.. ఆ ఆరోపణలన్నీ మరింత బలంగా మారుతాయి. పార్టీతో పాటు వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే, నెక్ట్స్ ఏం జరగబోతోందనే దానిపై పొలిటికల్ ఇంట్రెస్ట్ పెరిగింది. హరీశ్ లాబీయింగ్‌కు ఈటల తలొగ్గుతారా? ఉన్నది ఉన్నట్టు చెప్పి.. తలెత్తుతారా?

Editor