ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. గ్రూప్1, గ్రూప్2 కు గ్రీన్ సిగ్నల్..

సీఎం జగన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే విడుద‌ల చేసిన యూనివ‌ర్శిటీ అధ్యాప‌కుల పోస్టుల భ‌ర్తీతో పాటు గ్రూప్ – 1, గ్రూప్ – 2, ఇత‌ర పోటీ ప‌రీక్షల ద్వారా ఉద్యోగాల భ‌ర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. వీటిలో 900 వరకు గ్రూప్‌–2 పోస్టులుండగా వందకుపైగా గ్రూప్‌–1 పోస్టులు ఉన్నాయి. ఇక డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్‌ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్‌ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి డిసెంబర్‌లో సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

 

ఇక స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇటీవలే మరో19 వేల 37 కోట్ల విలువైన 10 పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో ఏడు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు కాగా.. మరో మూడు విస్తరణ కార్యక్రమాలు ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 69వేల 565 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

 

వీటితో పాటు SIPB ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కుల గణనకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇక మంత్రి అంబటి రాంబాబుపై ఖమ్మంలో జరిగిన దాడి గురించి కేబినెట్‌లో సీఎం దృష్టికి తీసుకొచ్చారు మంత్రి అమర్‌నాథ్. దీంతో దాడికి సంబంధించిన వివరాలను సీఎం జగన్.. మంత్రి అంబటిని అడిగి తెలుసుకున్నారు.

Posted Under AP
Editor