అనంతపురం జిల్లా, రాయదుర్గం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు గర్వపడే రాజధానిగా అమరావతి వెలుగొందుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన బిల్లు-2014 చట్ట సవరణకు పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదాన్ని తెలపడం ఆనందదాయకమన్నారు. రాయదుర్గం పట్టణంలో గురువారం నిర్వహించిన “ఒకే రాష్ట్రం ఒకే రాజధాని” కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయదుర్గం వినాయక సర్కిల్ లో ర్యాలీ నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ… చట్ట సవరణకు దేశంలోని 11 పార్టీలు కలసి మద్దతు ప్రకటించడం అభినందనీయమన్నారు. దేశం మొత్తం బాసటగా నిలబడటం తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ సంపూర్ణ సహకారంతో లోకేష్ బాబు వేగంతో అమరావతి శరవేగంగా పరుగులు తీస్తుందని ఆశాభావం వ్యక్తపరిచారు. 2028 నాటికి ప్రధాన భవనాలన్నీ పూర్తి అవుతాయని, ప్రపంచంలోని ప్రతి ఆంధ్రుడు గర్వించదగ్గ రాజధానిగా అమరావతి నిలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి మినహా ఇక వేరే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. చట్ట సవరణపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం వ్యక్తం అవుతుంటే..! “ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది ” మరోదారి అన్నట్లు వైకాపా తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోందని ధ్వజమెత్తారు. వైకాపా బిల్లును వ్యతిరేకిస్తూ రెండు సభల్లోను ఆపార్టీ వాకౌట్ చేయడం చూస్తుంటే… అమరావతిపై వైసీపీ ఎంత కడుపుమంట, ద్వేషం, కక్షతో రగిలిపోతోందో అర్థమవుతుందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలన్నీ ఏకతాటిపై నిలిచి సంపూర్ణ సహాయ, సహకారాలు ప్రకటిస్తుంటే ఒక్క వైకాపా మాత్రం తన విద్వేషాన్ని చాటుకుందన్నారు. ఉభయసభల్లో వాకౌట్ చేయడం వైకాపా చేసిన చారిత్రాత్మక తప్పిదమని పేర్కొన్నారు. బిల్లును వ్యతిరేకించడం ద్వారా రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత వైసిపి కోల్పోయిందన్నారు. మరోవైపు ఎవరికీ తెలియని మావిగన్ అనే కొత్త పేరు ఆయన తెరపైకి తీసుకురావడంతో ప్రపంచ దృష్టిలో జగన్ ఓ జోకర్ గా మిగిలిపోయేలా చేసిందన్నారు. ఇలాంటి పిచ్చి ఆలోచనలతో జగన్ కు మైండ్ దొబ్బిందని కాలవ ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో మహిళలు నిర్వహించిన అమరావతి ఉద్యమం ఓ కలికితురాయిగా నిలిచిపోతుందన్నారు. వారి పోరాటపటిమ భావితరాలకు ఓస్పూర్తిగా గుర్తుండిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, బిజెపి నాయకులు వసుంధర, అంబోజి రావ్, మండల పార్టీ అధ్యక్షుడు కురుబ హనుమంతు,కాలవ సన్నన్న, మాజీ కౌన్సిలర్లు టoకశాల హనుమంతు, ప్రశాంతి, బండి భారతి,వేణు,కడ్డిపూడి మహబూబ్ బాషా, పూజారి శివ, పైతోట అంజి,వాల్మీకి సిద్ధప్ప,కరెన్న, బంగి శంకర్,జావేద్, గొనభావి రమేష్,యాలపుల వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.
