Latest Posts

రాజధాని పేరుతో అమరావతిలో భారీ దోపిడీ: తాడేపల్లి మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ ఆరోపణ

విజయవాడ, తాడేపల్లి.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిపై ప్రజల్లో నిజానిజాలు తెలుసుకోవాలని కోరారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రస్తావించబడిందా అని ఆయన ప్రశ్నించారు.

ఏడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతిలో ఏం చేశారని ప్రశ్నించారు. భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా?

అమరావతిపై అసెంబ్లీలో తెచ్చిన తీర్మానం ఓ డ్రామా అని జగన్ అన్నారు. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం లేదని మంత్రి పార్థసారథి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం ప్రస్తావన లేదని పునరుద్ఘాటించారు.

చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి అని, ఆయన ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యమని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదని, ఆ రాష్ట్రాలే నిర్ణయించాయని అన్నారు.

అమరావతి విస్తరణపై ప్రశ్నిస్తూ.. చంద్రబాబు సొంత లెక్కల ప్రకారం కేవలం రోడ్లు, డ్రైనేజీలకే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చవుతుందన్నారు. దీని ప్రకారం లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

2019కి ముందు ఉన్న మాస్టర్ ప్లాన్ ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. ఒకప్పుడు అమరావతిని “వరల్డ్ క్లాస్ సిటీ”గా అభివర్ణించినా ఇప్పుడు ఒక్క మున్సిపాలిటీకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? చదరపు అడుగుకు రూ.11 వేల నుంచి 14 వేల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు.

ఐదున్నర గంటల చర్చలో అమరావతిపై స్పష్టత రాలేదన్నారు జగన్. రాజధాని పేరుతో పట్టపగలు దోచుకుంటున్నారని, ఈ దోపిడీని దాచిపెట్టేందుకు చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అలాగే మండలిలో చర్చ జరగకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. కౌన్సిల్ సభ్యులు అవినీతిని బయటపెడతారని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. అసెంబ్లీలు చట్టాలను రూపొందిస్తాయని, అవసరమైతే వాటిని కూడా సవరించవచ్చని ఆయన అన్నారు.

Posted Under AP
Editor