Latest Posts

అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరం.. ఫామ్‌హౌస్ నుంచే బీఆర్ఎస్‌కు దిశానిర్దేశం!

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీని కుదిపేయనున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖర్ రావు ఈ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై జరిగే చర్చకు హాజరు కాకూడదని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ కేసీఆర్ సభకు గైర్హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, సభకు రానప్పటికీ పార్టీని నడిపించే వ్యూహరచనలో ఆయన చురుగ్గా ఉన్నట్లు సమాచారం. నిన్న ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి కీలక సూచనలు చేశారు.

 

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను, అసత్యాలను గట్టిగా తిప్పికొట్టాలని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో హరీశ్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్లే, ఈసారి కూడా సభలో ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు అవకాశం కోరాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను అనుమతి కోరారు.

 

కాళేశ్వరం అంశానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రజా సమస్యలపైనా ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. యూరియా కొరత, వరద నష్టం, సీజనల్ వ్యాధులు, పారిశుద్ధ్య లోపం వంటి అంశాలపై సభలో గళం విప్పాలని ఆదేశించినట్లు సమాచారం.

Editor