Latest Posts

తెలంగాణలో ముగుస్తున్న వైన్ షాపుల లైసెన్సులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వైన్ షాపులకు జనాభాను ప్రామాణికంగా తీసుకుని కొత్త లైసెన్స్ ఫీజులను ఖరారు చేసింది. ప్రస్తుత లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్ 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తుల ఫీజును రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2025 డిసెంబర్‌ నుంచి 2027 నవంబర్‌ వరకు రెండేళ్ల కోసం లైసెన్సులు జారీ చేయనున్నట్లు పేర్కొంది. మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కూడా కల్పించింది. గౌడ్ లకు 15 శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంది.

 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాలకు వర్తించే ఈ కొత్త విధానం ప్రకారం, జనాభాను బట్టి ఫీజులను పలు స్లాబులుగా విభజించారు.

 

అబ్కారీ శాఖ నిర్ణయించిన వివరాల ప్రకారం:

 

* 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజును రూ. 50 లక్షలుగా నిర్ణయించారు.

* 5 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉంటే రూ. 55 లక్షలు చెల్లించాలి.

* 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న చోట ఫీజు రూ. 60 లక్షలుగా ఉంది.

* లక్ష నుంచి 5 లక్షల జనాభా వరకు రూ. 65 లక్షలు ఖరారు చేశారు.

* 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 85 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

* 20 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలు, పట్టణాల్లో అత్యధికంగా రూ. 1 కోటి 10 లక్షల లైసెన్స్ ఫీజును నిర్ణయించారు.

 

ప్రస్తుత లైసెన్సుల గడువు ముగియనుండటంతో, రాబోయే విడతకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కోసం అబ్కారీ శాఖ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది.

Editor